ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో కీలక పాత్ర పోషించిన రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని చివరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పట్టుకుంది. నాలుగు సార్లు విచారణకు గైర్హాజరైన ఆయన, పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతూ చివరకు శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారుల చేతికి చిక్కారు. సోమవారం సాయంత్రం అత్యంత చాకచక్యంగా ఏర్పాట్లు చేసిన అధికారులు, ముందస్తుగా సమాచారాన్ని గుర్తించి ప్రత్యేక బృందంతో రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. విచారణకు హాజరుకాక తప్పించుకు తిరుగుతున్న ఆయన కోసం అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేయగా, గోవాలో ఉన్నట్టు సంకేతాలు దొరికాయి.
గోవాలో గుట్టుచప్పుడు కాకుండా వ్యూహాలు.. చివరకు పోలీసులకి ఫ్లైట్ నుంచి పట్టుబాటు
శుక్రవారం రోజున రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని విచారించిన తర్వాత, రాజ్ తన తండ్రికి వాట్సాప్ సందేశం పంపడం ద్వారా తన గోవాలో ఉన్న విషయాన్ని తెలియజేశాడు. ఉపేందర్ రెడ్డి ఫోన్పై నిఘా పెట్టిన సిట్ అధికారులు వెంటనే గోవాలో గాలింపు ప్రారంభించారు. అయితే రాజ్ ముందుగానే ఈ ముహూర్తాన్ని గమనించి, మంగళవారం విచారణకు వస్తానంటూ ఓ ఆడియో సందేశం విడుదల చేశాడు. ఇదే సమయంలో ‘రాజేశ్ రెడ్డి’ అనే నకిలీ పేరుతో ఇండిగో విమానంలో హైదరాబాద్కు టికెట్ బుక్ చేసుకోవడం, అక్కడి నుంచే చెన్నైకి బయలుదేరేందుకు మరో టికెట్ బుక్ చేయడం పోలీసుల దృష్టికి వచ్చింది. సిట్ బృందం అప్రమత్తమై శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాట్లు చేసి, విమానం దిగిన వెంటనే నిఘా ఉంచింది. చాలా సేపు బయటకు రాకపోవడంతో అధికారులు నేరుగా లోపలికి వెళ్లి రాజ్ కసిరెడ్డిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
విచారణకు హాజరు కాదన్న రాజ్ మాటలను నమ్మని సిట్ అధికారులు
అరెస్ట్ సమయంలో కూడా రాజ్ కసిరెడ్డి “రేపు విచారణకు వస్తాను, వదిలేయండి” అంటూ అధికారులను కోరాడు. కానీ గతంలో నాలుగు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరుకాకపోయిన కారణంగా, ఆయన మాటలను నమ్మడానికి సిట్ నిరాకరించింది. వెంటనే ఆయనను అరెస్ట్ చేసి, ఈ విషయాన్ని రాజ్ తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అనంతరం నిన్న రాత్రే విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించారు. నేడు రాజ్ కసిరెడ్డిని సీఐడీ కోర్టులో హాజరు పరచి, కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రాజ్ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సిట్, కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నది. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా లుక్ అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేసిన విషయం విదితమే.
మద్యం స్కాంలో కొత్త మలుపు – పరారికి ప్లాన్ విఫలం
ఈ అరెస్ట్తో మద్యం కుంభకోణం కేసులో కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. రాజ్ కసిరెడ్డి గోవా నుంచి తిరిగి వచ్చినా, మరోసారి పరారయినట్లయితే కేసు విచారణ మరింత ఆలస్యం అయ్యేది. విదేశాలకు పారిపోయే యత్నాన్ని ముందే పసిగట్టి, శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనను అరెస్ట్ చేసిన సిట్ చర్యలను పలువురు అభినందిస్తున్నారు. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి నుంచి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసు వల్ల మద్యం అక్రమాలకు సంబంధించిన మరిన్ని గుట్టుచప్పుడు కాని నిజాలు బహిర్గతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
READ ALSO: YCP leader : గోరంట్ల మాధవ్ కు రెండ్రోజుల పోలీస్ కస్టడీ