ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్కాం ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డికి పర్సనల్ అసిస్టెంట్గా పనిచేసే పైలా దిలీప్ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) అరెస్ట్ చేసింది. దుబాయ్ పారిపోవడానికి యత్నించిన దిలీప్ చెన్నైలో పట్టుబడ్డాడు. అతడి ఫోన్ లొకేషన్ను ట్రాక్ చేసి చెన్నైకి వెళ్లిన సమాచారం మేరకు అక్కడే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దిలీప్ వద్ద లిక్కర్ స్కాంకు సంబంధించిన కీలక సమాచారం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు.
రాజశేఖర్ రెడ్డిని ఏసీబీ న్యాయస్థానం కస్టడీ అనుమతి
ఇటు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏసీబీ న్యాయస్థానం కస్టడీకి అనుమతించింది. సిట్ అధికారులు కోరిన 10 రోజుల కస్టడీకి కాకుండా, ఏడు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న రాజశేఖర్ రెడ్డిని రేపటి నుంచి విచారించనున్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ జరపాలని కోర్టు సూచించింది.
దిలీప్ అరెస్ట్తో కేసు దర్యాప్తు మలుపు
లిక్కర్ స్కాం కేసు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ స్థాయిలో నిబంధనల ఉల్లంఘనలపై, ఉన్నతాధికారుల ప్రమేయంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దిలీప్ అరెస్ట్తో కేసు దర్యాప్తు మలుపు తిరగనుందని, మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. సిట్ విచారణ ద్వారా ఈ కుంభకోణానికి సంబంధించి మరిన్ని కీలక వ్యక్తుల పేర్లు బయటపడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Read Also : J&Kలో ఐదుగురు చొరబాటుదారుల హతం