ఈ రోజు వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే సమాచారం వెల్లడైంది.రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో-4, విజయనగరం జిల్లాలో-5, పార్వతీపురం మన్యం జిల్లాలో-8 మొత్తం 17 మండలాల్లో తీవ్రవడగాలులు, 21 మండలాల్లో వడగాలులు ప్రభావంచూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. గురువారం నంద్యాల జిల్లా దోర్నిపాడులో 43.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో 43.8 డిగ్రీలు, కడప జిల్లా అట్లూరులో 43.6 డిగ్రీలు, విజయనగరంలో 42.8 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. అలాగే 139 ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయని, వచ్చే ఐదు రోజుల్లో రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్యలో నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తేలికపాటి వాన
మే తొలి వారంలో అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. వచ్చే నెల రోజుల్లో ఎల్నినో తటస్థంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మే మొదటి వారంలోనే సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వానలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఏపీలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఉమ్మడి కర్నూలు జిల్లాలో భానుడి భగభగలకు జనాలు అల్లాడిపోతున్నారు. గత కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. గురువారం దొర్నిపాడులో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ‘గోస్పాడు, రుద్రవరంలో 43.4, ఆళ్లగడ్డ 42.8, కౌతాళం 42.7, పాణ్యం 42.5, గడివేముల 42.4, కర్నూలు అర్బన్, కొత్తపల్లి, నంద్యాలలో 42.3 డిగ్రీలు ఉంది. మంత్రాలయం, బండి ఆత్మకూరు 42.2, బనగానపల్లి, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ 42.0, డోన్, ప్యాపిలి 41.9, బేతంచెర్ల 41.6, కోడుమూరు, సంజామల, ఆత్మకూరు, కొలిమిగుండ్ల, పాములపాడు 41.7, కల్లూరు, నందికొట్కూరు, శిరివెళ్ల 41.3, శ్రీశైలం 41.2, కోసిగి, మద్దికెర, పగిడ్యాల 41.1, ఓర్వకల్లు, తుగ్గలి, చాగలమర్రి, మిడుతూరులో 41.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి’ అని అధికారులు తెలిపారు. అలాగే ప్రకాశం, కడప జిల్లాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయిఅధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు ఎండలు, మరో వైపు వేడిగాలులు ఉక్కపోతలతో జనాలు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, డాక్టర్లు సూచిస్తున్నారు.
Read Also: AP Govt : ఏపీలో స్పౌజ్ పింఛన్లు… ఈరోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ