Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వీర్ సావర్కర్కు మహారాష్ట్ర ప్రజలు ఎంతో గౌరవం ఇస్తారని పేర్కొన్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని మందలించింది. స్వాతంత్ర్య సమరయోధులను ఎగతాళి చేయడం తగదని మళ్లీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులపై ఎవరూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి అనుమతించమని పేర్కొంది. వారిని అపహాస్యం చేస్తే ఇకపై కోర్టు సుమోటోగా విచారణ చేపడుతుందని తెలిపింది.

రాహుల్పై ఫిర్యాదు చేసిన నృపేంద్ర పాండేకు నోటీసులు
సావర్కర్పై వ్యాఖ్యల విషయంలో రాహుల్పై దాఖలైన కేసులో ఆయనపై క్రిమినల్ చర్యలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. రాహుల్పై ఫిర్యాదు చేసిన నృపేంద్ర పాండేకు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తనకు జారీ చేసిన సమన్లను రద్దు చేయడానికి నిరాకరించిన అలహాబాద్ హైకోర్టు ఆదేశాన్ని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
వీర్ సావర్కర్ బ్రిటిష్ సేవకుడని
మహారాష్ట్రలో 2022లో మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. వీర్ సావర్కర్ బ్రిటిష్ సేవకుడని, వారి నుంచి పెన్షన్ కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు స్వాతంత్ర్య సమరయోధుడైన వీర్ సావర్కర్ను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ నృపేంద్ర పాండే అనే వ్యక్తి యూపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. అయితే, దీనిపై అనేకసార్లు విచారణకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్లోని న్యాయస్థానం రాహుల్కు రూ.200 జరిమానా విధించింది.
Read Also: లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ హతం!