ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పునర్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ సంపూర్ణ సహకారంతో అమరావతిని ప్రపంచస్థాయిలో ఒక మోడల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని, ఇది ఐదు కోట్ల ఆంధ్రుల కలల పరిపూరణగా నిలుస్తుందని తెలిపారు. అమరావతి కేవలం ఒక నగరం కాదని, అది ప్రజల ఆశలు, త్యాగాలకు ప్రతిరూపమని సీఎం వ్యాఖ్యానించారు.
ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పుతో అమరావతికి మళ్లీ ఊపిరి
రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తుచేశారు. గత ప్రభుత్వ కాలంలో అమరావతి రైతులు అనుభవించిన కష్టాలు, వారి నిరాహార దీక్షలు మరువలేనివని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పుతో అమరావతికి మళ్లీ ఊపిరి వచ్చిందని తెలిపారు. అమరావతి ఉద్యమం ప్రజాస్వామ్యంలో అరుదైన సంఘటనగా అభివర్ణించారు.
గ్రీన్ సిటీగా అభివృద్ధి
ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం రాష్ట్ర చరిత్రలో ఓ గౌరవనీయ ఘట్టమని చంద్రబాబు పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని, పర్యావరణ హితమైన గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రపంచ నగరాలతో అనుసంధానం కలిగిన అంతర్జాతీయ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అమరావతిలో లక్షల మంది విద్యార్థులకు అధునాతన విద్య అవకాశాలు కల్పిస్తామని వివరించారు.
Read Also :Amaravati Relaunch : సీఎం చంద్రబాబుపై మోడీ ప్రశంసలు