ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22, 23 తేదీలలో రెండు రోజుల పాటు సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవల సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రధాని మోదీకి పర్యటనకు ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే. గతంలో 2024 డిసెంబర్లో ఈ పర్యటన జరగాల్సి ఉండగా, షెడ్యూల్ అందుబాటులో లేక పోవడం వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యే దశకు చేరడంతో పర్యటన తేదీలు ఖరారయ్యాయి.
భారత్ – సౌదీ అరేబియా మధ్య సంబంధాలు
ఈ పర్యటనలో ప్రధానంగా వాణిజ్యం, ఇంధన భద్రత, రక్షణ సహకారం, వ్యూహాత్మక ప్రాజెక్టులు వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. భారత్ – సౌదీ అరేబియా మధ్య సంబంధాలు గత కొంతకాలంగా బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) ప్రాజెక్టు అమలు దిశగా ఈ సమావేశం దోహదపడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య కొత్త ఒప్పందాలు
కేంద్ర వర్గాల ప్రకారం, ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశముంది. అలాగే భారతదేశానికి ఇంధన సరఫరా, మౌలిక సదుపాయాలు, డిజిటల్ రంగాలలో పెట్టుబడులు వంటి అంశాలపై కూడా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ పర్యటన ద్వైపాక్షిక సహకారాన్ని కొత్త దశకు తీసుకెళ్లేలా ఉండనుందని, ప్రపంచ రాజకీయాలలో భారత్కు ఉన్న ప్రాధాన్యతను ఈ సందర్శన మరోసారి హైలైట్ చేయనుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.