ఫిజీ దేశపు అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న భారత రాష్ట్రపతి

President Droupadi Murmu receives Fiji’s highest civilian award

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పసిఫిక్ దేశాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా, ఫిజీ దేశంలో పర్యటిస్తున్న ద్రౌపది ముర్ముకు ఆ దేశ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ‘కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజి’ ప్రదానం చేసింది. ఫిజీ అధ్యక్షుడు రటు విలియమే మైవాలిలి కటోనివెరే ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పురస్కారంతో భారత రాష్ట్రపతిని గౌరవించారు. దీనిపట్ల ద్రౌపది ముర్ము ఫిజీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలను ముర్ము ఈ సందర్భంగా ప్రస్తుతించారు. ఫిజీని దృఢమైన, స్థితిస్థాపక, సుసంపన్న దేశంగా మలిచే దిశగా భారత్ భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు సంసిద్ధంగా ఉందని ముర్ము స్పష్టం చేశారు.