వయనాడ్‌ ఘటన..బాధితులకు ప్రభాస్‌ రూ.2 కోట్ల విరాళం

Hero Prabhas
Hero Prabhas

న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ విలయంలో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో విపత్తులో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు. ఇప్పటికే సినీ తారలు, పలువురు రాజకీయ నేతలు తమ వంతు సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్‌ స్టార్‌ నటుడు ప్రభాస్‌ భారీ విరాళాన్ని ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.2 కోట్లు అందించనున్నట్లు ఆయన టీమ్‌ తాజాగా తెలిపింది.

కాగా, వయనాడ్ ప్రకృతి విపత్తు నేపథ్యంలో ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ భారీ విరాళం ప్రకటించారు. రామ్ చరణ్, తాను కలిసి కోటి రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు చిరంజీవి ఎక్స్ వేదికగా ఇటీవల వెల్లడించాడు. అల్లు అర్జున్ కూడా రూ.25 లక్షలు ఇస్తున్నట్లు వెల్లడించాడు. కమల్ హాసన్, సూర్య, జ్యోతిక, కార్తి, విక్రమ్, నయనతార, విఘ్నేష్ శివన్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫాజిల్ తదితరులు కూడా విరాళం ఇచ్చారు.