డీకే శివకుమార్ ‘పవర్’ను తగ్గించే ముమ్మర ప్రయత్నాలు
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్లో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. సీఎం పదవిని డీకే శివకుమార్కు అందకుండా చేయడానికి సీఎం సిద్ధరామయ్య వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డీకే శివకుమార్ పవర్ తగ్గించేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నది. మరోవైపు సిద్ధరామయ్య సన్నిహితుల మంత్రి పదవులను ఊడగొట్టేందుకు డీకే శివకుమార్ ప్రయత్నిస్తున్నారు. ఇరు వర్గాల ఎత్తుగడలో కర్ణాటక కాంగ్రెస్ రాజకీయ పోరు ఢిల్లీ చేరింది. కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలను కలుస్తూ ఇరు వర్గాల నేతలు ఒకరికి ఒకరు చెక్ పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసే రికార్డును సొంతం చేసుకోవాలని సిద్ధరామయ్య ఆశ పడుతున్నారు. బుధవారం ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు ఈ రికార్డు మాజీ సీఎం దేవరాజ్ అర్స్ పేరిట ఉంది. ఆయన 2,792 రోజులు సీఎంగా పని చేశారు. సిద్ధరామయ్య ఇప్పటికి 2,467 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి 6 వరకు సీఎం పదవిలో కొనసాగితే ఈ రికార్డును సిద్ధరామయ్య అధిగమిస్తారు. అయితే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సీఎం పదవీకాలాన్ని రెండున్నరేండ్ల చొప్పున పంచుకోవాలనే ఒప్పందం ఉందనే ప్రచారం ఉంది.

ఈ ఒప్పందం అమలైతే ఈ ఏడాదే సీఎం పదవిని డీకే శివకుమార్కు అప్పగించాల్సి ఉంటుంది. డీకేకు సీఎం పదవి ఇచ్చేందుకు సిద్ధూ వర్గం సిద్ధంగా లేదు. జీ పరమేశ్వర, ఎంబీ పాటిల్, హెచ్సీ మహదేవప్ప లాంటి సిద్ధరామయ్య సన్నిహిత మంత్రులు తెరపైకి వచ్చి.. ఐదేండ్లూ సీఎంగా సిద్ధరామయ్య కొనసాగుతారని, దేవరాజ్ అర్స్ రికార్డును అధిగమిస్తారని ప్రకటిస్తున్నారు.
సీఎం వర్గానికి చెక్ పెట్టేందుకు డీకే శివకుమార్ ప్రతివ్యూహాలు అమలు చేస్తున్నారు. మంత్రుల పనితీరును సమీక్షించి, పనితీరు సరిగ్గా లేని మంత్రులను తప్పించాలని ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డీకే శివకుమార్ కోరినట్టు తెలుస్తున్నది. సిద్ధరామయ్యకు సన్నిహితులైన ఏడుగురు మంత్రులను తప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. దీంతో హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్య వర్గీయులు.. డీకే శివకుమార్ను పీసీసీ పదవి నుంచి తొలగించాలని, ఆయన నిర్వర్తిస్తున్న ఇరిగేషన్, బెంగళూరు నగరాభివృద్ధి శాఖలను ఇతర మంత్రులకు కేటాయించాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. డీకే సన్నిహితులైన ఇద్దరు మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. కర్ణాటకలో వర్గపోరుతో తలపట్టుకున్నది.