Kakani: క్వార్ట్జ్ అక్రమ మైనింగ్,రవాణా,నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను వినియోగించడం పై పొదలకూరు పోలీసు స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డికి పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రావాలని అందులో పేర్కొన్నారు.

అయితే నోటీసు ఇచ్చేందుకు ఆదివారం సాయంత్రం పొదలకూరు ఎస్సై హనీఫ్ నెల్లూరులోని మాజీ మంత్రి ఇంటికి వెళ్లగా. ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. మాజీ మంత్రి ఇంటిలో లేకపోవడంతో ఆయన పారిపోయారనే ప్రచారం జరిగింది. నిన్న హైదరాబాద్ లోని తన నివాసంలో కాకాణి ఉగాది వేడుకలు చేసుకుంటున్న ఫొటోలను ఆయన కార్యాలయం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. కొందరు పోలీసులిచ్చిన ముందస్తు సమాచారంతోనే ఆయన అందుబాటులో లేకుండా పోయినట్లు సమాచారం.
కాగా, చెన్నైలో నివాసముండే విద్యా కిరణ్కు పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలోని 32 ఎకరాల్లో రుస్తుం మైన్ పేరిట మైకా తవ్వకాలకు అనుమతి ఉంది. దానికి లీజు గడువు ముగియడంతో పునరుద్దరణకు దరఖాస్తు చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెల్లరాయి గనులపై ఆ పార్టీ నేతలు కన్నేశారు. లీజుదారుడు అంగీకరించకపోయినా ప్రజాప్రతినిధుల అండతో దౌర్జన్యంగా తెల్లరాయిని తరలించారు. అప్పట్లో మంత్రిగా వ్యవహరిస్తున్న కాకాణి సొంత గ్రామం తోడేరుకు సమీపంలోనే ఈ దందా జరిగింది. దాని పై ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అప్పట్లో ఆందోళన కూడా చేశారు.