రాష్ట్రాన్ని గాడిన పెట్టడంపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. NDRF ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టానికి కేంద్రం మూడింతల సాయాన్ని అందిస్తుందని తెలిపారు. కూటమి సర్కార్ ఏర్పడ్డాక రూ.3లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. 2028 నాటికి పోలవరం ద్వారా రాష్ట్రం మొత్తానికి నీరు సరఫరా అవుతుందని చెప్పారు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే NDRF ఉంటుందని అమిత్ షా చెప్పుకొచ్చారు. మనుషుల విపత్తు నుంచి కాపాడటానికి NDA ముందు ఉంటుందని చెప్పారు. 2019 నుంచి ఏపీని ఏవిధంగా ధ్వంసం చేశారో మనమంతా చూశామని తెలిపారు. చంద్రబాబు, మోదీ జోడీల నాయకత్వంలో ఏపీ మూడింతల ప్రగతి సాధిస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు పరిపాలన దక్షతతో పని చేస్తున్నారని అన్నారు. ఆరు నెలల్లో ఏపీకి మోదీ రూ. 3 లక్షల కోట్లు సాయం అందించారని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.11,440 కోట్లు సాయం కింద కేంద్రం కేటాయించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుర్తుచేశారు.
అంతకు ముందు చంద్రబాబు ప్రసంగంలో ఏపీ వెంటిలేటర్ నుంచి బయటపడినా ఇంకా పేషంట్ గానే ఉంది. ఇటీవలి కాలంలో అమరావతి, పోలవరంకు చేసిన సాయంతో ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. ఈ సహకారం ఇలా కొనసాగాలని విజ్ఞప్తి చేశారు. భారత్ గ్లోబల్ లీడర్ కావాల్సి ఉంది. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, స్పేస్ టెక్నాలజీ, డేటా సైన్స్ రంగాల్లో దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 కల్లా భారత్ నెంబర్ వన్ అవుతుంది. ఎవరూ ఆపలేరన్నారు. గత ఆరు నెలల కాలంలో కేంద్రం ఎంతో సహకరిచిందని కీలకమైన ప్రాజెక్టుల్ని కేటాయించారని అన్నారు. పవన్ కల్యాణ్ కూడా కేంద్రం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.