విదేశీ పర్యటనలు ముగించుకొని భారత్‌ చేరుకున్న ప్రధాని మోడీ

PM Modi reached India after completing foreign tours

న్యూఢిల్లీః విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారత్‌కు చేరుకున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో రష్యాలో పర్యటించిన మోడీ.. తర్వాత ఆస్ట్రియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా రెండు దేశాల పర్యటనలు ముగించుకొని ప్రధాని భారత్‌ చేరుకున్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయం లో ల్యాండ్‌ అయ్యారు.

మోడీ సోమ, మంగళవారాల్లో రష్యా లో పర్యటించిన విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానం మేరకు మాస్కోలో మోడీ రెండు రోజులు పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా సోమవారం రాత్రి మోడీకి పుతిన్‌ తన అధికారిక నివాసంలో విందు ఇచ్చారు. రెండో రోజు ఇద్దరు నేతలు విస్త్రృత చర్యలు జరిపారు. రష్యా అధ్యక్షుడి ముందు ఉక్రెయిన్‌ యుద్ధంపై మోడీ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇక మాస్కో పర్యటన అనంతరం మోడీ మంగళవారం సాయంత్రం ఆస్ట్రియా బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆ దేశ చాన్స్‌లర్‌ కర్ల్‌ నెహమ్మార్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పశ్చిమ ఆసియా, ఉక్రెయిన్‌ సంక్షోభాలు చర్చకు రాగా, ఇది యుద్ధానికి సమయం కాదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌, రష్యా శాంతి ప్రక్రియలో భారత్‌ ఎంతో ప్రధానమైనదని, అది శక్తివంతమైన ప్రభావవంతమైన పాత్రను పోషించగలదని ఆస్ట్రియన్‌ చాన్స్‌లర్‌ కర్ల్‌ నెహమ్మార్‌ అన్నారు. అదే సమయంలో తమ దేశం తటస్థ విధానాన్ని అవలంబిస్తుందని అన్నారు.

భారత ప్రధాని ఆస్ట్రియా పర్యటకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే తొలిసారి. 1983లో చివరిసారిగా ఇందిరా గాంధీ ఆ దేశాన్ని సందర్శించారు. ఇందిరా గాంధీ తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత ఆ దేశంలో పర్యటించిన రెండో ప్రధానిగా మోడీ నిలిచారు. మోడీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం ప్రారంభమై 75 ఏండ్లు పూర్తయ్యాయని ఆస్ట్రియన్‌ చాన్స్‌లర్‌ కర్ల్‌ నెహమ్మార్‌ తెలిపారు.