ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు – మోడీ

కార్గిల్ దివస్ సందర్భంగా పీఎం మోదీ యుద్ధవీరులకు నివాళి అర్పించారు. భారత భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన పాకిస్థాన్ సేనలను తరిమికొట్టిన భారత సైన్యం వీర పరాక్రమానికి ప్రతీక కార్గిల్ యుద్ధం. ఆ విజయగాథకు నేటితో పాతికేళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో కార్గిల్ 25వ విజయ్ దివస్ ను పురస్కరించుకొని కార్గిల్ లోని ద్రాస్ లో యుద్ధవీరుల స్మారకాన్ని ప్రధాని మోడీని సందర్శించారు

లద్దాక్లోని కార్గిల్ వార్ మెమోరియల్ను సందర్శించిన ఆయన వీరజవాన్ల స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళ్లు అర్పించారు. అనంతరం యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు అంజలి ఘటించారు. అనంతరం అమర జవాన్ల సతీమణులు, కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. దేశంకోసం సైనికులు చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయి. కార్గిల్ విజయం భారత సైనికుల పరాక్రమానికి నిదర్శనం. 1999లో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికులను కలిశాను. సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి. కార్గిల్ యుద్ధ సమయంలో సామాన్యుడిలా సైనికుల మధ్య ఉన్నాను. దేశంకోసం వారు చేసిన పోరాటం నా మదిలో నిలిచిపోయింది. పాకిస్థాన్ గత అనుభవాల నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదన్న మోదీ.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

కార్గిల్‌ అమరవీరులకు పలువురు నేతలు నివాళులు ఆర్పించారు. కార్గిల్‌ యుద్ధ విజయం మన బలగాల ధైర్యానికి, అసాధారణ పరాక్రమానికి ప్రతీక అని రాష్ర్టపతి ద్రౌపదీ ముర్ము సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అన్నారు. కార్గిల్ శిఖరాలపై భారతమాతను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన ప్రతి సైనికుడికి నివాళులు ఆర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సైనికుల త్యాగం, పరాక్రమాన్ని దేశప్రజలందరకీ స్ఫూర్తి అని రాష్ర్టపతి కొనియాడారు. దిల్లీలోని జాతీయ యుద్ధస్మారకం వద్ద రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాళులర్పించారు. దేశానికి వారు చేసిన సేవ, త్యాగం ప్రతి భారతీయుడికి, రాబోయే తరాల వారికి స్ఫూర్తి అని రాజ్‌నాథ్‌ అన్నారు.