సీజేఐ ఇంట గణపతి పూజలో పాల్గొన్న ప్రధాని మోడీ

PM Modi participated in Ganpati Puja at CJI’s house

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం సాయంత్రం ఢిల్లీలోని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గ‌ణ‌ప‌తి పూజలో పాల్గొన్నారు. త‌మ‌ నివాసానికి విచ్చేసిన‌ ప్రధానికి సీజేఐ జ‌స్టిస్ చంద్ర‌చూడ్‌, ఆయ‌న అర్ధాంగి క‌ల్ప‌నాదాస్ సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఆ తర్వాత మోడీ, సీజేఐ క‌లిసి విఘ్నేశ్వ‌రుడికి పూజ‌ చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ మ‌హారాష్ట్ర సంప్ర‌దాయ టోపీ ధరించి ప్ర‌త్యేకంగా క‌నిపించారు.

గణేశ్‌ పూజ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రితో పాటు సీజేఐ చంద్రచూడ్ భార్య కూడా ప్రార్థనలు చేశారు. ఇక దేశ‌వ్యాప్తంగా గ‌ణేశ్ ఉత్స‌వాల సంద‌డి కొన‌సాగుతోంది. ఈ నెల 7న వినాయ‌క చ‌వితితో ప్రారంభమైన‌ 10 రోజుల గణపతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి.

కాగా, మ‌హారాష్ట్ర‌లో ఈ గ‌ణప‌తి వేడుక‌లు ఇంకా ఘ‌నంగా జ‌రుగుతాయ‌నే విష‌యం తెలిసిందే. ఇక్కడ గణేశ్‌ పూజ చాలా ఉత్సాహంగా జరుపుకునే ప్రధాన పండుగ. యాదృచ్ఛికంగా చంద్రచూడ్ మహారాష్ట్రకు చెందినవారు. ముంబైలో జన్మించిన చంద్రచూడ్ తన ప్రారంభ జీవితంలో ఎక్కువ భాగం మహారాష్ట్రలోనే గడిపారు. అక్కడే ఆయ‌న‌ న్యాయ రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛ‌నీయ‌ ఘటనలు చోటుచేసుకోకుండా ఉత్సవాలు నిర్వహించాలని డివిజనల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా గ్రేటర్ ముంబైలో 15వేల‌ మందికి పైగా పోలీసుల‌ను మోహరించారు. అలాగే పక్కనే ఉన్న థానే కమిషనరేట్ ప్రాంతంలో 6,000 మందికి పైగా పోలీసులు విధులు నిర్వ‌హిస్తున్నారు.