అమృత్‌ కాలానికి చెందిన బడ్జెట్‌ ఇది : ప్రధాని మోడి

PM Modi ahead of Budget Session

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కేంద్రంలో ఎన్డీయే సర్కార్‌ మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇక ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఆరు బిల్లులను సభామోదం కోసం తీసుకురానుంది. మరోవైపు నీట్‌ ప్రశ్నపత్నం లీకేజీ, రైల్వే భద్రత, కావడి యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలనే నిబంధన వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని విపక్ష ఇండియా కూటమి సభ్యులు సిద్ధమయ్యారు.

కాగా, బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని మోడి పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యం పూర్తి చేస్తామని ప్రధాని పునరుద్ఘాటించారు. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం దేశం కోసం పోరాడుతోందని చెప్పారు. ఐదేళ్లు ప్రగతి కోసం పోరాడాలని, తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఆలోచించాలని కూటమి నేతలకు మోడీ పిలుపునిచ్చారు.

‘అమృత్‌ కాలానికి చెందిన బడ్జెట్‌ ఇది. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ పూర్తి చేసే బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నాం. సవాళ్లను ఎదుర్కొంటు ముందుకెళ్తున్నాం. తమ లక్ష్యానికి ఈ బడ్జెట్ బలమైన పునాది అవుతుందని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. మా ప్రభుత్వం దేశం కోసం పోరాడుతుంది. 2029 జనవరిలో ఎన్నికల్లో పోరాడదాం. సభలో మాట్లాడేందుకు వివిధ పార్టీల నుంచి వచ్చిన సభ్యులకు అవకాశం వస్తుంది. ఐదేళ్లు ప్రగతి కోసం పోరాడాలి.. తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఆలోచించాలి.’ అని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మరోవైపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే సభ్యులంతా పార్లమెంటుకు చేరుకున్నారు.