రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన న్యాయమూర్తికి పదోన్నతి

జడ్జి హరీష్ హన్ముఖ్ సహా 68 మందికి ప్రమోషన్లు

rahul-gandhi

న్యూఢిల్లీః మోడీ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన గుజరాత్ జడ్జి సహా 68 మందికి ఇటీవల పదోన్నతి లభించింది. ఈ పదోన్నతులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను మే 8వ తేదీన విచారించనుంది. పరువు నష్టం కేసులో రాహుల్ ను దోషిగా నిర్ధారించి, రెండేళ్ల జైలు శిక్ష విధించిన గుజరాత్ న్యాయమూర్తి హరీష్ హన్ముఖ్ భాయి వర్మకు కూడా పదోన్నతి లభించింది. మొత్తం 68 మందికి ప్రమోషన్ లభించగా, వీటిపై పిల్ దాఖలైంది.

68 మంది న్యాయమూర్తులు 65 శాతం కోటా విధానం ఆధారంగా పదోన్నతి పొందారు. ఈ పదోన్నతిని సీనియర్ సివిల్ జడ్జి కేడర్ కు చెందిన ఇద్దరు జ్యూడిషియల్ అధికారులు రవి కుమార్ మెహతా, సచిన్ ప్రతాప్రయ మెహతా సవాల్ చేశారు. మార్చి 10న గుజరాత్ హైకోర్టు జారీ చేసిన పదోన్నతుల జాబితాను రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. జ్యూడిషియల్ అధికారుల నియామకానికి గుజరాత్ హైకోర్టు… మెరిట్, సీనియారిటీ కొత్త జాబితాను విడుదల చేయాలని కూడా వారు కోరారు. హరీష్ హన్ముఖ్ ను సూరత్ జిల్లా కోర్టులో చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ గా నియమించారు. ఆయనకు న్యాయాధికారిగా పదేళ్ల అనుభవం ఉంది.