వైసీపీ కి బిగ్ షాక్ ..మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా

వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన జగన్ కు కూటమి సర్కార్ మాత్రమే కాదు సొంత పార్టీ నేతలు సైతం షాక్ ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు చాలామంది నేతలు పార్టీని వీడగా…తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీకి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపడం జరిగింది.

నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీకి రాజీనామా చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. రెండు మూడు నెలలుగా పరిస్థితులు మారాయని… అందుకే పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తదుపరి కార్యాచరణపై తన క్యాడర్ తో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటానని మీడియా కు తెలియజేసారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు త్వరలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం సిట్టింగ్ సీటును దొరబాబుకు వైసీపీ అధినేత జగన్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ టికెట్‌ను వంగా గీతకు కేటాయించారు. పవన్ చేతిలో గీత ఘోర పరాజయం పాలయ్యారు. ఎన్నికల నుండే దొరబాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు పార్టీ కే రాజీనామా చేసారు.