జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుండి బెయిల్ ఫై విడుదలయ్యారు. కొంతకాలంగా పలు కేసుల్లో పిన్నెల్లి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పలు కండీషన్లతో ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శనివారం ఉదయం ఆయన జైలు నుండి బయటకు వచ్చారు.

జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి.. అనిల్ కుమార్ యాదవ్ లు స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం జైలు వద్దకు పిన్నెల్లి అనుచరులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వారిని పోలీసులు జైలు ప్రాంగణం నుంచి బయటకు పంపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి బయటకు రాగానే ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.

పిన్నెల్లి విడుదల అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఇలాంటి కేసులకు వైసీపీ నేతలు కార్యకర్తలు భయపడరని.. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.