న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఒకే విడతలో 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే రాహుల్గాంధీ ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం ఎవరు చేశారో.. ఓటు వేసేటప్పుడు ఢిల్లీ ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ను ఉద్దేశించి రాహుల్గాంధీ ఈ కామెంట్ చేశారు.

ఓటు వేసేటప్పుడు ఢిల్లీలో కాలుష్యం, మురికి నీరు, చెడిపోయిన రోడ్లకు ఎవరు బాధ్యులో గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు. స్వచ్ఛమైన రాజకీయాల గురించి మాట్లాడుతూనే ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడింది ఎవరో కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కోరారు. పని చేయనివాళ్లను మళ్లీమళ్లీ గెలిపించి ఓటును వృథా చేసుకోవద్దని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ప్రజలు తమ హక్కులను తిరిగి పొందుతారని, రాజ్యాంగం బలోపేతమై ఢిల్లీ మళ్లీ ప్రగతి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు.
ఇక, ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. పాలనా రికార్డు, సంక్షేమ పథకాలే ఆధారంగా వరుసగా మూడవసారి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్లోనైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్లడికానున్నాయి. ఢిల్లీలో 13,766 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వివిధ పార్టీల నుంచి 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.