ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ అభివృద్ధికి ఊపిరి పోస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని గెలుచుకుంటున్నారు. ఇందులో భాగంగా పిఠాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి విస్తరించే నిర్మాణ పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ప్రస్తుతం 30 పడకలతో పనిచేస్తున్న ఈ ఆసుపత్రిని, మరింత మెరుగైన సేవలందించేలా అప్గ్రేడ్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా పాల్గొన్నారు. స్థానికుల హర్షధ్వానాల మధ్య శంకుస్థాపన కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “పిఠాపురాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. ఈ ఆసుపత్రి విస్తరణకు తొలి అడుగు పడింది.

ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటి ఇప్పుడు అది నిజం అవుతోంది” అని తెలిపారు.ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రజల ఆశలు నెరవేరేలా చూస్తామన్నారు.ఆసుపత్రి విస్తరణ వల్ల స్థానికులకి మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రాబోతున్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చిన్న చిన్న అనారోగ్యాలకే విజయవాడ, విశాఖ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఇక ఉండదని తెలిపారు.
స్థానికంగా చికిత్స అందడం వల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయన్నారు.ఇప్పుడు చేపట్టిన 100 పడకల ఆసుపత్రితో పాటు, సదుపాయాలు, సిబ్బంది నియామకం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన స్పష్టం చేశారు.ఇది పిఠాపురం ప్రజలకు ఎంతో అవసరమైన ఆవశ్యకమైన పథకం అని పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మా ప్రభుత్వం హామీలు ఇవ్వడానికే కాదు, నెరవేర్చడానికే వచ్చింది. పిఠాపురం అభివృద్ధికి ఇది కేవలం ఆరంభం మాత్రమే అన్నారు. ప్రజలతో నేరుగా కలుసుకుంటూ అభిప్రాయాలు తెలుసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రజల స్పందనలో పవన్ కళ్యాణ్ పట్ల నమ్మకమూ, అభిమానమూ స్పష్టంగా కనిపించింది. అభివృద్ధి పనులు వేగంగా పూర్తవాలని అందరూ ఆశిస్తున్నారు.
Read Also : Andhra Pradesh:ఏపీ లోని పలు ప్రాంతాలకు వర్ష సూచన