పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. లాహోర్కు వెళ్తున్న ప్రయాణికుల బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి ఏడుగురు ప్రయాణికులను హతమార్చారు. ఈ దుర్ఘటన బలూచిస్థాన్లోని బర్ఖాన్ ప్రాంతంలో చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు.అంతర్జాతీయ వార్తా సంస్థల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం, దుండగులు లాహోర్ మార్గంలో వెళ్తున్న పలు వాహనాలను అడ్డగించారు. ఆ సమయంలో 45 మంది ప్రయాణికులతో బస్సు కూడా ఆ మార్గంలో వెళ్తోంది. దుండగులు బస్సును ఆపి, టైర్లలో గాలిని వదిలించి, ప్రయాణికులందరినీ బస్సు బయటకు దింపారు. అనంతరం, వారి గుర్తింపు కార్డులు చూపించాలని ఆదేశించారు. ఇందులో, ప్రత్యేకంగా ఏడుగురిని బస్సు దిగమని బలవంతపెట్టారు. వారిని కొంతదూరానికి తీసుకెళ్లి తుపాకులతో విచక్షణారహితంగా కాల్చి హత్య చేశారు. మృతులంతా పంజాబ్ ప్రావిన్స్కు చెందిన వారిగా గుర్తించారు.పంజాబ్లోని డేరా ఘాజాఖాన్ నుంచి బలూచిస్థాన్లోని బర్ఖాన్కు కలిపే ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ ఖాదీమ్ హుస్సేన్ ఈ దుర్ఘటన వివరాలను రాయిటర్స్తో పంచుకున్నారు. కాల్పులకు పాల్పడింది ఎవరో, ఆ దాడి వెనుక ఉద్దేశ్యం ఏమిటన్నది ఇప్పటికీ తెలియరాలేదు. ఏ సంస్థ ఈ ఘటనకు ఇప్పటి వరకు బాధ్యత వహించలేదు.

బలూచిస్థాన్ ప్రావిన్స్
ఇదిలా ఉండగా, బలూచిస్థాన్లో ఇటీవలి కాలంలో ఇలాంటి దాడులు పెరిగిపోతున్నాయి. గత వారం కూడా అక్కడి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు ప్రయాణిస్తున్న వాహనంపై పేలుడు సంభవించింది. ఆ ఘటనలో 11 మంది మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
బలూచిస్తాన్ సమస్య
బలూచిస్తాన్ అనేది పాకిస్థాన్లో అతిపెద్ద ప్రావిన్స్. ఇది భూభాగ పరంగా దేశంలో 44% వంతు ఆక్రమించుకున్నా, జనాభా తక్కువ. సహజ వనరులు సమృద్ధిగా ఉన్నా, బలూచిస్తాన్ ప్రజలు తీవ్ర పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదే కారణంగా దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో అసంతృప్తి, తిరుగుబాట్లు కొనసాగుతున్నాయి.
చారిత్రక నేపథ్యం:
1947లో విభజన సమయంలో బలూచిస్తాన్ ప్రదేశ్ స్వతంత్ర రాజ్యంగా ఉండేది.అయితే, 1948లో పాకిస్థాన్ ఆ ప్రాంతాన్ని అనుసంధానం చేసుకుంది.అప్పటి నుంచి బలూచ్ ప్రజల్లో విపరీతమైన అసంతృప్తి మొదలైంది.పాకిస్థాన్ సైన్యం బలవంతంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుందని బలూచ్ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు.
భద్రతా సిబ్బంది
ఈ ఘాతుక ఘటన పంజాబ్, బలూచిస్థాన్ ప్రజల్లో తీవ్ర భయాందోళన రేపింది. ముఖ్యంగా ప్రయాణికులు తమ ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసర ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. పంజాబ్, బలూచిస్థాన్ రాష్ట్రాల సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.