పవన్ కళ్యాణ్ ను కలిసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా భేటీ

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమావేశం అయ్యారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆయన నివాసానికి వెళ్లి దాదాపు గంటన్నర సేపు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో జనసేన – తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రానికి అత్యంత ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని ఇరు పార్టీల నేతల నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీ శ్రేణుల్లో ఎక్కడా పొరపొచ్చాలు లేకుండా నేతలు వ్యవహరించాలని నిర్ణయించారు.

చంద్రబాబు – పవన్ కళ్యాణ్ లక్ష్యం వల్లనే మోడీ ఆశీస్సులతో ఏర్పాటైన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని పల్లా శ్రీనివాస్ అన్నారు. జన సైనికులు క్షేత్రస్థాయిలో చూపించిన రణత్సాహం, టిడిపి పార్టీ శ్రేణుల సమిష్టి కృషి, బిజెపి అభిమానుల ఆదరణ సమిష్టిగా రాష్ట్ర ఓటర్ల తీర్పులో ప్రతిబింబించిందని పవన్ కళ్యాణ్ అన్నారు.భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రజల తీర్పునకు అనుగుణంగా కనీసం దశాబ్దం పాటు ఈ మైత్రి కొనసాగేలా క్షేత్రస్థాయిలో చర్యలు ఉండాలని ఇరువురు నేతలు ఆకాంక్షించారు.