ఇంకా పెళ్లి మంగళసూత్రం మెరిసే వయసులో ఓ మహిళ తన భర్త మృతదేహాన్ని చూస్తూ ఏడుస్తుండటం.ఆ దృశ్యం ఎవరి హృదయాన్ని అయినా తాకకుండా ఉండదు.నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది.పెళ్లయి ఇంకా ఆరు రోజులు కూడా కాలేదు. జీవితాన్ని కలిసి ప్రారంభించిన కొత్త జంట.ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.వివాహం ఏప్రిల్ 16న ముస్సోరిలో ఘనంగా జరిగింది.స్కూల్ టీచర్ అయిన హిమాన్షిని, వినయ్ ప్రేమతో పెళ్లి చేసుకున్నారు.ముందుగా హనీమూన్కి స్విట్జర్లాండ్ వెళ్లాలనుకున్నారు.కానీ వీసా ఆలస్యం కావడంతో కాశ్మీర్ను ఎంపిక చేసుకున్నారు.పహల్గామ్ సమీపంలోని బైసరన్ ప్రాంతాన్ని చూసేందుకు వెళ్లిన ఈ జంటపై మంగళవారం ఉగ్రవాదులు దాడి చేశారు.

ఈ దాడిలో వినయ్ ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటన తర్వాత హిమాన్షి భర్త మృతదేహాన్ని చూసి ఆత్మవిస్మృతిలోకి వెళ్లిపోయినట్లైంది.ఇంకా మెహందీ చెరిగిపోని చేతులతో భర్తను నిమిరుతూ గుండెచప్పుడు వినిపించేలా రోదించడమే మిగిలింది.ఆ క్షణాలను చిత్రీకరించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.పీటీఐ ఈ దృశ్యాన్ని తమ ఫొటోగ్రాఫర్ ద్వారా అందించింది. వినయ్ మరణ వార్త హిమాన్షి కుటుంబానికి మంగళవారం రాత్రి చేరింది.“వినయ్ చనిపోయాడని హిమాన్షి ఫోన్లో చెప్పినప్పుడు మా నమ్మకం రాలేదు,” అని ఆమె మేనత్త బబిత చెబుతారు. అయితే మీడియా ఫొటోలు చూసాక నిజమని తెలిసింది. అప్పుడు నుంచి ఇద్దరు కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.వినయ్ తండ్రి రాజేష్ నర్వాల్, హిమాన్షి తండ్రి చిన్ననాటి స్నేహితులు.
ఇరు కుటుంబాలు కూడా కర్నాల్కు చెందినవే వినయ్ మృతదేహాన్ని మొదట ఢిల్లీలోకి, అక్కడి నుంచి స్వస్థలమైన కర్నాల్కు తరలించారు. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.ఇంకా వినయ్ పెళ్లిలో వేసుకున్న షేర్వాణీ ఇంట్లో వేలాడుతూనే ఉంది. ఆయన ప్రయాణానికి తెచ్చిన బ్యాగ్ కూడా పూర్తిగా సర్దలేదు. అతని నవ్వులు ఇంకా గదుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం చేతిలో ముహూర్తపు చిట్టి పట్టుకుని చేసిన వేడుకలు.. ఇప్పుడు ఒక అంత్యక్రియలో కలిసిపోయాయి.ఈ ఘటన కాశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవాద సమస్యను మరోసారి వెలుగులోకి తెచ్చింది. కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఓ జంట.. ప్రేమతో నిండి ఉండాల్సిన హనీమూన్లో భయంకరంగా విడిపోయింది. వినయ్ లాంటి దేశభక్తుల త్యాగాలు మరువలేనివి. కానీ, ఈ దాడితో ఏకంగా రెండు కుటుంబాలు శాశ్వతంగా బాధలో మునిగిపోయాయి.
Read Also : Pahalgam Terrorist Attack : ఉగ్రదాడిపై ఎంఐఎం నేత ఒవైసీ వ్యాఖ్యలు