రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన కీలకమైన విద్యాశాఖ అధికారిక వెబ్సైట్పై సైబర్ దాడి జరిగింది. మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెబ్సైట్ హోమ్పేజీని హ్యాకర్లు పూర్తిగా మార్చేశారు. ‘పాకిస్థాన్ సైబర్ ఫోర్స్’ పేరుతో ఈ దాడికి పాల్పడినట్లు హ్యాకర్లు పేర్కొన్నారు. వెబ్సైట్ను తెరిచిన వెంటనే రెచ్చగొట్టే సందేశాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
వివాదాస్పద వ్యాఖ్యలు
హ్యాక్ అయిన వెబ్సైట్ హోమ్పేజీలో “ఫెంటాస్టిక్ టీ క్లబ్ పాకిస్థాన్ సైబర్ ఫోర్స్” అనే శీర్షికతో పాటు, పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు ఉంచారు. “పహల్గామ్ దాడి కాదు… అది అంతర్గత కుట్ర… నిప్పు రాజేసింది మీరే, ఇప్పుడు పర్యవసానాలకు సిద్ధంగా ఉండండి” వంటి సందేశాలను పోస్ట్ చేశారు. అంతేకాదు, ఉగ్రదాడిలో మరణించిన నేవీ అధికారి భార్యను ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుట్రలో భాగంగానే ఆమెను రంగంలోకి దించారని పాకిస్థాన్ హ్యాకర్లు ఆరోపించారు.

ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు
అంతేకాకుండా, 2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్కు చిక్కిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఉదంతాన్ని ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అభినందన్ టీ తాగుతూ పాక్ అధికారులతో మాట్లాడిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దానిని ప్రస్తావిస్తూ హ్యాకర్లు ఈ పోస్టులు పెట్టారు.
మంగళవారం ఉదయం ఈ సైబర్ దాడి వెలుగులోకి రావడంతో విద్యాశాఖ అధికారులు తక్షణమే వెబ్సైట్ను తాత్కాలికంగా నిలిపివేశారు. “వెబ్సైట్ను తాత్కాలికంగా మూసివేశాం. ఐటీ విభాగం పునరుద్ధరణ పనులను వేగంగా చేపడుతోంది. ఈ ఘటనపై సైబర్ భద్రతా ఏజెన్సీలకు కూడా సమాచారం అందించాం. ఈ దాడి వెనుక ఉన్నవారిని గుర్తించడానికి, డేటాకు ఏదైనా నష్టం జరిగిందా అని అంచనా వేయడానికి దర్యాప్తు ప్రారంభించాం,” అని రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ తెలిపారు.
Read Also: Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి వెలుగులోకి సంచలన నిజాలు!