ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లాలో ఆన్లైన్ గేమ్స్కు మరో యువకుడు బలయ్యాడు. పరిగి మండలం పైడేటి గ్రామానికి చెందిన జయచంద్ర (23) డిగ్రీ పూర్తి చేసిన అనంతరం గ్రామంలోనే డెయిరీ వ్యాపారం ప్రారంభించాడు. గ్రామీణ యువకుడిగా ఉపాధి మార్గం సృష్టించుకోవడమే కాకుండా ఇతర రైతులకు ఉపయుక్తమయ్యే విధంగా వ్యవహరించాడు. అయితే వ్యాపారంలో ఎదురైన సమస్యలు, ఆర్థిక ఒత్తిడితో పాటు ఆన్లైన్ గేమింగ్లో పడి, అతని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేశాయి.
ఆర్థిక భారాలు, ఒత్తిడి
డెయిరీ నిర్వహణలో రైతులకు చెల్లించాల్సిన 3 లక్షల రూపాయల బాకీ వల్ల గ్రామస్థుల ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి, మరో 3 లక్షల రూపాయలు అప్పు చేసి నష్టపోయాడు. ఈ రెండూ కలిసి అతనిపై తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించాయి. నెల రోజుల క్రితం డెయిరీ మూసివేశాడు. బెంగళూరుకు ఉద్యోగం కోసం వెళ్తున్నట్లు చెప్పిన జయచంద్ర, హిందూపురం పట్టణ పరిధిలోని గుడ్డం ప్రాంతంలో రైలు పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. శరీరాన్ని పరిశీలించిన పోలీసులు అతని చొక్కాపై ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు అనే వాక్యం రాసి ఉండటాన్ని గుర్తించారు. ఈ మాట అతని చివరి హెచ్చరికగా నిలిచింది. ఆన్లైన్ గేమ్స్ గతంలో కేవలం వినోదం కోసం మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఆర్థిక వ్యసనాలుగా, మానసిక అనారోగ్యాలకు దారితీసే విధంగా రూపాంతరం చెందాయి. ముఖ్యంగా రియల్ మనీ గేమ్స్, బెట్టింగ్ యాప్లు, స్లాట్ గేమ్స్ వంటి యాప్స్ యువతను బానిసలుగా మార్చేస్తున్నాయి.
Read also: Cricket Betting Case : వైసీపీ నేతపై ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు