మరోసారి కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

MLC Kavitha

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ ఆగస్టు 7వ తేదీకి వాయిదా పడింది. ఇప్పటికే కవిత దాఖలు చేసిన పలు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరిగింది. తదుపరి విచారణను రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజా ఆగస్ట్ 7కు వాయిదా వేశారు. సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను జడ్జి వాయిదా వేశారు.

కాగా, ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. న్యాయవాదులు నితీష్ రాణా, మోహిత్‌రావు రాలేదా.. అని అడిగారు. అయితే ఆ సీనియర్ లాయర్లు అందుబాటులో లేరని.. అందువల్ల డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేయాలని కోర్టును కవిత తరఫు న్యాయవాది కోరారు. ఈ క్రమంలో జడ్జి కల్పించుకుంటూ ఇప్పటికే డిఫాల్ట్ పిటిషన్‌పై రెండుసార్లు వాయిదా వేశామని.. చివరి సారిగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. వాదనలు వినిపించకపోతే పిటిషన్‌ విత్ డ్రా చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే తదుపరి విచారణ ఆగస్టు 7 మధ్యాహ్నం 12.30కు వాయిదా వేశారు.

ఇదిలావుంచితే, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు ఢిల్లీకి వెళ్లారు. వారు రెండు రోజుల పాటు ఢిల్లీలో వుంటారు. కేటీఆర్, హరీశ్ రావు రేపు తీహార్ జైల్లో కవితను కలవనున్నారు.