రైతుల ఆందోళనలో పాల్గొన్న వినేశ్ ఫోగ‌ట్‌

Olympian Vinesh Phogat joins farmers’ protest as MSP demand hits 200 days

న్యూఢిల్లీ: ఢిల్లీ శివార్లలోని శంభు సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళన ఇవాళ్టితో 200వ రోజుకు చేరింది. ఈ ఆందోళ‌న‌కు భార‌త స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ మద్దతు తెలిపారు. శంభు బార్డర్‌కు వెళ్లి రైతుల ఆందోళనలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు వినేశ్‌ ఫోగట్‌ను సత్కరించారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మీరు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా..? అని విలేక‌ర్ల నుంచి ఎదురైన‌ ప్రశ్నకు వినేశ్ బ‌దులిచ్చారు. ఇప్పుడు తాను రాజకీయాలు మాట్లాడబోన‌ని అన్నారు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడితే బాగుండ‌ద‌ని, వారి (రైతుల) పోరాటాన్ని అవ‌మానించిన‌ట్లు అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.

ఇక్కడ మీడియా ఫోకస్‌ చేయాల్సింది తనమీద కాదని, రైతుల మీద ఫోకస్ చేయాలన్నారు. రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సంద‌ర్భంగా వినేశ్‌ డిమాండ్‌ చేశారు. కాగా, పంటలకు కనీస మద్ధతు ధర అంశానికి చట్టబద్ధత కల్పించాలని, తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి రైతులు ఆందోళన చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా శ‌నివారం ఢిల్లీ పరిసరాల్లోని ఖనౌరీ, శంభు, రతన్‌పుర స‌రిహ‌ద్దుల‌ను ముట్టడించాలని రైతులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వినేశ్‌ ఫోగట్‌ వారికి మద్దతు ప్రకటించారు. శంభు బార్డర్‌కు వెళ్లి రైతుల ఆందోళనలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.