న్యూఢిల్లీ: ఇస్రో గత బుధవారం చేపట్టిన 100వ ప్రయోగానికి అనుకోని అడ్డంకులు ఏర్పడ్డాయి. అంతరిక్షంలోకి పంపిన ఎన్వీఎస్-02 శాటిలైట్లో సాంకేతిక లోపం తలెత్తిందని ఇస్రో తాజాగా ప్రకటించింది. ‘నిర్దేశిత కక్ష్యలోకి ఎన్వీఎస్-02 నావిగేషన్ శాటిలైట్ను ప్రవేశపెట్టలేకపోయాం. కక్ష్యను పెంచేందుకు శాటిలైట్లోని థ్రస్టర్లను మండించే ప్రయత్నం చేయగా, ఆక్సిడైజర్లను అందించే వాల్వ్లు తెరుచుకోలేదు’ అని ఇస్రో వెబ్సైట్ పేర్కొన్నది.
యూఆర్ శాటిలైట్ సెంటర్లో తయారైన శాటిలైట్లో సాంకేతిక లోపం కారణంగా ద్రవరూప ఇంధనం మండించలేకపోయారు. దీంతో ఈ మిషన్ ఆలస్యం కావొచ్చు లేదా.. శాటిలైట్పై ఆశలు వదులుకోవచ్చునని సైంటిస్టులు భావిస్తున్నారు. జనవరి 29న శ్రీహరి కోట నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ద్వారా ఎన్వీఎస్-02 శాటిలైట్ను ఇస్రో ప్రయోగించింది.

కాగా, ఎన్వీఎస్-02 శాటిలైట్లో ఉన్న ఇంజిన్లు మొరాయించడం వల్లే, దాన్ని నిర్దేశిత కక్ష్యలోకి పంపలేకపోయారని తెలిసింది. ఆ శాటిలైట్లోని ఇంజిన్లలోకి ఆక్సిడైజర్ను పంపి, వాటిని యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ‘ఆన్’ మోడ్లోకి తేవాల్సి ఉంటుంది. అయితే ఆక్సిడైజర్ను శాటిలైట్లోని ఇంజిన్లలోకి చేరవేసే వాల్వ్లు తెరుచుకోలేదు. దీంతో ఇంజిన్లు పనిచేసే అవకాశం లేకుండాపోయింది. దీంతో ప్రస్తుతం ఎన్వీఎస్-02 ఉపగ్రహం భూఅనువర్తిత బదిలీ కక్ష్య (జీటీవో)లో పరిభ్రమిస్తోంది. ఈ కక్ష్యలో శాటిలైట్ పరిభ్రమిస్తే నేవిగేషన్ వ్యవస్థ కార్యకలాపాల నిర్వహణకు పనికిరాదు. శాటిలైట్ ఇంజిన్లలోకి ఆక్సిడైజర్ను పంపేందుకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. భారతదేశ స్వదేశీ ఉపగ్రహ ఆధారిత నేవిగేషన్ వ్యవస్థలో ఎన్వీఎస్-02 ఉపగ్రహం చాలా ముఖ్యమైంది.