తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు మరో అద్భుత అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.తిరుమల శ్రీవారి సేవను చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఏప్రిల్ 30న శ్రీవారి సేవ స్వచ్చంద జూన్ నెల కోటా ఆన్లైన్లో విడుదల చేయనుంది. జనరల్ శ్రీవారి సేవ (తిరుమల, తిరుపతి) – ఉదయం 11:00 గంటలకు. నవనీత సేవ (మహిళలకు మాత్రమే) – మధ్యాహ్నం 12:00 గంటలకు పరకామణి సేవ (పురుషులకు మాత్రమే) – మధ్యాహ్నం 1:00 గంటలకు గ్రూప్ లీడర్ సేవ (కొత్తగా ప్రారంభించిన సేవ) – మధ్యాహ్నం 2:00 గంటలకు విడుదల చేస్తారని టీడీపీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు శ్రీవారి సేవ యొక్క నాణ్యతను మెరుగుపరిచి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ అధికారులు శ్రీ సత్యసాయి సేవా సంస్థ (పుట్టపర్తి), ఇషా ఫౌండేషన్ (కోయంబత్తూర్), ఆర్ట్ ఆఫ్ లివింగ్ (బెంగళూరు) వంటి ప్రఖ్యాత సంస్థలను సందర్శించి అధ్యయనం చేశారు.
అప్లికేషన్
అధ్యయనం ఆధారంగా తిరుమల శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను టీటీడీ తీసుకొచ్చింది. ఈ మార్పులు ఏప్రిల్ 30న కొత్తగా రూపొందించిన అప్లికేషన్ ద్వారా అమలులోకి రానున్నాయి. గత రెండేళ్లుగా పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు సేవలో పాల్గొంటున్నారు. వయస్సు 45 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న వారు నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు వీరిని “గ్రూప్ లీడర్స్” అని పిలుస్తారు. వీరు 15 రోజుల, ఒక నెల లేదా మూడు నెలల వ్యవధిలో సేవ చేయడానికి ఆన్లైన్లో ఎంపిక చేసుకోవచ్చు. ఈ గ్రూప్ లీడర్స్ శ్రీవారి సేవకుల పనిని పర్యవేక్షించడం, సేవకు వారి హాజరు తీసుకోవడం, ప్రతి ఒక్క సేవకుని/సేవకురాలి పనితీరును మూల్యాంకనం చేయడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు.

ఆన్ లైన్
పదో తరగతి విద్యార్హత కలిగిన పురుషులకు పరకామణి సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఆన్ లైన్ ద్వారా పరకామణి సేవను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. టీటీడీ తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం మాత్రమే కాకుండా ఆ వెంకన్నకు సేవ చేసుకునే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది. శ్రీవారి సేవలకు టీటీడీ ఉచితంగానే దర్శనంతో పాటూ వసతి కూడా కల్పిస్తోంది. శ్రీవారి సేవకు వెళ్లాలనుకుంటున్న భక్తులు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ కోరుతోంది. టీటీడీ ఇప్పటికే జులై నెలకు సంబంధించిన దర్శన టోకెన్లు, ఆర్జిత సేవ టికెట్లు, వసతి గదుల్ని కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Read Also: Andhra Pradesh: పింఛన్లలో బయటపడ్డ అనర్హులు