అమరావతి: టీడీపీకి తిరువూరు ఎమ్మెల్యే అనేక సమస్యలు తెచ్చి పెడుతున్నారు ఇటీవల ఓ గ్రామంలో సిమెంట్ రోడ్ వివాదంలో ఆయన జోక్యం చేసుకోవడంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ వివాదంతో పాటు ఆయన పార్టీకి నష్టం చేసేలా పలు రకాల ప్రకటనలు,చర్యలు చేపడుతున్నారు. వీటన్నింటిపై వివరణ ఇవ్వాలని ఆయనకు టీడీపీ క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేసింది. సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
కొలికపూడి శ్రీనివాసరావు గతంలో అమరావతి ఉద్యమంలో కీలకంగా పని చేశారు. ఈ కారణంగా ఆయనకు టీడీపీ నుంచి కృష్ణా జిల్లా తిరువూరు టిక్కెట్ ను చంద్రబాబు కేటాయించారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న తిరువూరు నియోజకవర్గంలో ఆయన అనూహ్యంగా విజయం సాధించారు. అయిత ఆయన వివాదాలతో వరుసగా టీడీపీకి తలనొప్పులు తీసుకు వస్తున్నారు. ప్రతిపక్ష నేత తరహాలో ఆయన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకకు ప్రయత్నించారని అధికారులల్ని బెదిరించడంతో పాటు టీడీపీ క్యాడర్ తోనూ ఆయన గొడవలు పడుతున్నారని ఫిర్యాదులు ఉన్నాయి.

ఓ సారి ఓ మహిళ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఆయనపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఆయన తాను తప్పులు దిద్దుకుంటానని తెలియకుండా కొన్ని పొరపాట్లు జరిగాయని వివరణ ఇచ్చారు. దాంతో రెండు నెలల పాటు ఆయనను నియోజకవర్గానికి దూరంగా ఉండాలని సూచించారు. తర్వాత మళ్లీ వివాదాలు ప్రారంభించడంతో హైకమాండ్ అసంతృప్తికి గురయింది. ఆయనపై కఠిన చర్యలుతీసుకోవాలని నిర్ణయించిననట్లుగా తెలుస్తోంది. ఆయన తీరుతో పార్టీ నష్టపోతోందని తిరువూరు టీడీపీ క్యాడర్ పదే పదే ఫిర్యాదులు చేస్తోంది.
సివిల్స్ కోచింగ్ ఇచ్చే ఇనిస్టిట్యూట్ ను నిర్వహించే కొలికపూడి .. రాజకీయాలను డీల్ చేయడంలో విఫలమయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది. పాఠాల్లో ఉండే రాజకీయాలు వేరని.. అలాగే ఎమ్మెల్యేగా చేసే రాజకీయాలు వేరని.. ఆ రెండింటి మధ్య తేడా ఆయన చూపించలేక వివాదాల్లలో ఇరుక్కుపోతున్నారని భావిస్తున్నారు. ఆయన పార్టీ కోసం పని చేయకుండా నేరుగా ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకుని గెలిచేశారని దాని వల్ల క్యాడర్ ను ఆయన పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.