ఐపీఎల్ 2025 సీజన్లో వరుసగా ఓటములతో ఇబ్బందులు పడుతోన్న చెన్నై సూపర్ కింగ్స్, చివరికి గెలుపు మార్గంలోకి అడుగుపెట్టింది. సోమవారం జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై చెన్నై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 5 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో 168 స్కోరు చేసింది. శివమ్ దూబే(37 బంతుల్లో 43 నాటౌట్, 3 ఫోర్లు, 2సిక్స్లు), ధోనీ(11బంతుల్లో 26 నాటౌట్, 4ఫోర్లు, సిక్స్) జట్టు విజయంలో కీలకమయ్యారు.బిష్ణోయ్ (2/18) రెండు వికెట్లు తీశాడు. తొలుత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులకే పరిమితమైంది. రిషభ్ పంత్ (49 బంతుల్లో 63, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఈ సీజన్తో తొలి అర్ధ సెంచరీతో రాణించగా మిచెల్ మార్ష్ (30) ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో జడేజా (2/24), పతిరాన (2/45) తలా రెండు వికెట్లు తీశారు. వికెట్లు పడకపోయినా నూర్ అహ్మద్ 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి లక్నోను కట్టడి చేశాడు.సీఎస్కే లో తొలి మ్యాచ్ ఆడిన ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ (19 బంతుల్లో 27, 6 ఫోర్లు) సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. రచిన్తో కలిసి అతడు తొలి వికెట్కు 4.5 ఓవర్లలోనే 52 పరుగులు జతచేశాడు. ఈ సీజన్ పవర్ ప్లేలో ఫిఫ్టీ ప్లస్ స్కోరు చేయడం చెన్నైకి ఇది రెండోసారి మాత్రమే. అయితే అవేశ్ ఖాన్ రాకతో చెన్నై వికెట్ల పతనం మొదలైంది.అతడి 5వ ఓవర్లో రషీద్ పూరన్కు క్యాచ్ ఇవ్వడంతో చెన్నై ఇన్నింగ్స్ తడబడింది. క్రీజులో కుదురుకున్న రచిన్ మార్క్మ్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. బిష్ణోయ్ రంగప్రవేశంతో సీఎస్కే కష్టాలు రెట్టింపయ్యాయి. బిష్ణోయ్ 13వ ఓవర్లో జడేజా(7) పెవిలియన్ చేరగా, ఓవర్ తేడాతో దిగ్వేశ్ బౌలింగ్లో విజయ్ శంకర్(9) పెవిలియన్ చేరాడు. దీంతో 111 పరుగులకే చెన్నై 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శివమ్ దూబే, కెప్టెన్ ధోనీ లక్నో బౌలర్లకు ఎదురొడ్డి నిలుస్తూ చెన్నైకి కీలక విజయాన్ని అందించారు.
ఆశ్చర్యం వ్యక్తం
ఈ మ్యాచ్లో ధోని 236.36 స్ట్రయిక్రేట్తో బ్యాటింగ్ చేశాడు. నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 27 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ప్రకటించిన సమయంలో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తనను అవార్డుకు ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించాడు. చెన్నై జట్టుకు చెందిన స్పిన్నర్ నూర్ అహ్మద్ని ఈ సందర్భంగా ధోని ప్రశంసించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు నూర్ అర్హుడని తెలిపారు.మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎందుకు ఇస్తున్నారో తెలియదని ఆశ్చర్యంగా ఉందని తెలిపాడు. నూర్ చాలా బాగా బౌలింగ్ చేశాడని తాను అనుకుంటున్నానని చెప్పాడు. కొత్త బంతితోనూ చాలా బాగా బౌలింగ్ చేశారని పేర్కొన్నాడు. నిజానికి యువ ఆఫ్ఘన్స్పిన్నర్ నాలుగు ఓవర్లు వేసి కేవలం 13 పరుగులు ఇచ్చాడు. వికెట్లు మాత్రం దక్కలేదు. 3.25 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. 2019 తర్వాత తొలిసారిగా ధోని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. 2206 రోజుల తర్వాత ఐపీఎల్లో సోమవారం మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ని గెలుచుకున్నాడు. ఐపీఎల్లో 18వ సారి ధోని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. చివరిగా 2019లో రాజస్థాన్తో మ్యాచ్లో అవార్డును అందుకున్నాడు. ఆ మ్యాచ్లో 75 పరుగులు చేశాడు.

మిడిల్ ఓవర్ల
మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ ఈ మ్యాచ్లో గెలువడం బాగుందని చెప్పాడు. దురదృష్టవశాత్తు చివరి మ్యాచ్లో గెలువలేకపోయామని ఈ విజయం తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నారు. క్లిష్టమైన మ్యాచ్లో గెలిచినందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. ఈ విజయంతో జట్టును సెట్ చేస్తుందని ఆశిస్తున్నానని గత మ్యాచ్లో తాము తొలి ఆరు ఓవర్లలో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పడ్డామని కానీ, మిడిల్ ఓవర్ల మ్యాచ్తిరిగి తమ చేతుల్లోకి చేరిందని చెప్పాడు. బ్యాటింగ్లో ఆశించిన ఆరంభం పొందలేకపోయామని బహుశా చెన్నై వికెట్వల్ల కావొచ్చని భవిష్యత్లో మెరుగైన ప్రదర్శన ఇస్తామని తెలిపాడు.
Read Also: IPL 2025: బ్యాట్లను పరిశీలిస్తున్న అంపైర్లు