ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో 10 జిల్లాలకు జిల్లా సహకార బ్యాంకులు (డీసీసీబీ) మరియు జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాలకు (డీసీఎంఎస్) చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ, టీడీపీ, జనసేనల కూటమి ఏర్పడిన నేపథ్యంలో, అధికారం చేపట్టిన తర్వాత పార్టీల బలాబలాలను బట్టి నామినేటెడ్ పోస్టులను కేటాయిస్తున్నారు. అయితే తాజా నియామకాల్లో టీడీపీకి ఎక్కువ స్థానాలు దక్కగా, జనసేనకు రెండు స్థానాలు కేటాయించగా, బీజేపీకి మాత్రం ఒక్కస్థానం కూడా కేటాయించకపోవడం గమనార్హం.
Read Also : Chandrababu Naidu : అమరావతి విట్ వర్సిటీ ‘వి లాంచ్పాడ్ 2025’లో సీఎం చంద్రబాబు
డీసీసీబీ ఛైర్మన్ పదవులు అధికంగా టీడీపీకే
జిల్లా సహకార బ్యాంకుల ఛైర్మన్లుగా ప్రధానంగా టీడీపీ నేతలే నియమితులయ్యారు. శ్రీకాకుళం డీసీసీబీకి శివ్వల సూర్యనారాయణ, విజయనగరం డీసీసీబీకి కిమిడి నాగార్జున, గుంటూరు డీసీసీబీకి మాకినేని మల్లికార్జునరావు, కృష్ణా డీసీసీబీకి నెట్టెం రఘరామ్, నెల్లూరు డీసీసీబీకి ధనుంజయరెడ్డి, చిత్తూరు డీసీసీబీకి అమాస రాజశేఖర్రెడ్డి, అనంతపురం డీసీసీబీకి కేశవరెడ్డి, కర్నూలు డీసీసీబీకి విష్ణువర్థన్రెడ్డి, కడప డీసీసీబీకి బి. సూర్యనారాయణరెడ్డిలను నియమించారు. విశాఖపట్నం డీసీసీబీ చైర్మన్గా మాత్రం జనసేన నేత కోన తాతారావు ఎంపికయ్యారు.
డీసీఎంఎస్ ఛైర్మన్ పదవుల్లో టీడీపీదే పైచేయి
జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల ఛైర్మన్ల నియామకాల్లోనూ టీడీపీదే మేజారిటీ. శ్రీకాకుళం డీసీఎంఎస్కి అవినాష్ చౌదరి, విశాఖ డీసీఎంఎస్కి కొట్ని బాలాజీ, విజయనగరం డీసీఎంఎస్కి గొంప కృష్ణ, గుంటూరు డీసీఎంఎస్కి వడ్రాణం హరిబాబు, నెల్లూరు డీసీఎంఎస్కి గొనుగోడు నాగేశ్వరరావు, చిత్తూరు డీసీఎంఎస్కి సుబ్రమణ్యం నాయుడు, అనంతపురం డీసీఎంఎస్కి నెట్టెం వెంకటేశ్వర్లు, కర్నూలు డీసీఎంఎస్కి నాగేశ్వరయాదవ్, కడప డీసీఎంఎస్కి యర్రగుండ్ల జయప్రకాశ్లను నియమించారు. కృష్ణా డీసీఎంఎస్ ఛైర్మన్గా మాత్రం జనసేనకు చెందిన బండి రామకృష్ణను నియమించారు. మొత్తంగా చూసుకుంటే, నామినేటెడ్ పోస్టుల పంపిణీలో టీడీపీకి స్పష్టమైన అధిక్యం కనిపిస్తోంది.