టోల్ చెల్లింపు ప్రక్రియ కోసం హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యేది. హైవే టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపు ప్రక్రియతో సమయం వృథా అయ్యేది. దీనివల్ల ప్రయాణికులకు తీవ్రమైన అసౌకర్యం కలిగేది. పండుగలు, ఇతర రద్దీ సమయాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.ఈ సమస్యను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం 2019 డిసెంబర్ 15న ఫాస్టాగ్ విధానాన్ని తప్పనిసరి చేసింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీతో పనిచేసే ఫాస్టాగ్ల ద్వారా టోల్ ప్లాజాల వద్దకు వాహనం రాగానే ఆటోమేటిక్గా టోల్ రుసుము(Automatic toll fee) చెల్లించడం సాధ్యమైంది. ఇది కొంతమేరకు ట్రాఫిక్ రద్దీని తగ్గించినప్పటికీ, కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు లేదా తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వంటి కారణాల వల్ల వాహనాలు ఆగాల్సి వచ్చేది.తాజాగా అందుబాటులోకి వచ్చిన శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానం ఈ సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారాన్ని అందిస్తోంది. ఈ విధానంలో వాహనం టోల్ ప్లాజా వద్ద పూర్తిగా ఆగకుండానే అత్యాధునిక శాటిలైట్ టెక్నాలజీ(Satellite technology) ద్వారా నేరుగా బ్యాంకు ఖాతా నుండి లేదా అనుసంధానించబడిన ఇతర చెల్లింపు విధానాల ద్వారా టోల్ రుసుము ఆటోమేటిగ్గా వసూలు అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపైని కొన్ని టోల్ ప్లాజాల వద్ద ఈ విధానం విజయవంతంగా అమలవుతోంది.తద్వారా ట్రాఫిక్ రద్దీ లేకుండా వాహనదారులు సాఫీగా వెళ్లే ఛాన్సు దొరికింది. వాహనదారుల సమయాన్ని సైతం ఆదా చేస్తుంది.

వివరాల ప్రకారం
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు వారు ప్రయాణించిన దూరం మేరకే టోల్ చెల్లించేలా జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు(GPS-based toll collection) వ్యవస్థను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నూతన విధానం అమలులోకి వస్తే టోల్ ప్లాజాల వద్ద ప్రస్తుతం ఉన్న ఫిక్స్డ్ ఛార్జీల విధానానికి స్వస్తి పలకవచ్చు. గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను పరీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ట్రయల్ రన్ నిర్వహించే యోచనలో ఉంది. ఈ ట్రయల్ రన్ విజయవంతమైతే దేశంలోని ఇతర జాతీయ రహదారులపై కూడా ఈ విధానాన్ని అమలు చేయడానికి మార్గం సుగమం అవుతుంది.నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కి చెందిన ఒక అధికారి తెలిపిన వివరాల ప్రకారం,త్వరలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కూడా ఈ జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థ ట్రయల్ రన్ నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ జీపీఎస్ ఆధారిత విధానం ద్వారా వాహనం ఏ మార్గంలో ఎంత దూరం ప్రయాణించిందో జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతాల నుండి నేరుగా టోల్ రుసుమును వసూలు చేస్తారు.
Read Also: Nara Lokesh: జగన్ పై విరుచుకుపడ్డ నారా లోకేశ్