ఆపరేషన్ సిందూర్ పేరుతో పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.బుధవారం ( మే 7, 2025 ) అర్ధరాత్రి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఓకే ) లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు నిర్వహించింది.ఒక రాత్రిలోనే మూడు టెర్రర్ హెడ్క్వార్టర్స్ నేలమట్టం చేసింది. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడిపై ప్రతీకారంగా మురిడ్కేలో భారత ఆర్మీ దాడులు చేసింది.ఈ ఆపరేషన్లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై లక్ష్యంగా దాడులు జరపగా సుమారు 30 మంది ఉగ్రవాదులు హతమయినట్టు సమాచారం. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి.పాకిస్తాన్ తో పాటుగా పీఓకే లోని ఉగ్రవాద శిబిరాల పైన అర్ద్రరాత్రి భారత సైన్యం మెరుపు దాడి చేసింది. డ్రోన్లు, క్షిపణులతో భారత ఏయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద శిబిరాల పైన పక్కా సమాచారంతో గురి పెట్టి మరీ భారత సైన్యం, క్షిపణులు ప్రయోగించింది. ఉగ్రవాద శిబిరాల పైన భారత్ సైన్యం దాడులను దేశ వ్యాప్తంగా అందరూ సమర్థిస్తున్నారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా 2019లో బాలాకోట్ తర్వాత పాక్ సరిహద్దుల్లోకి వెళ్లి భారత్ చేసిన అతిపెద్ద దాడి ఇదే.
ప్రతీకార చర్య
ఈ నేపథ్యం లో పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబాలు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడిలో ఏపీకి చెందిన వ్యక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. అందులో నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ కూడా ఉన్నారు.ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం ప్రతీకార చర్యలపై మధుసూదన్ కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ చర్యను స్వాగతించిన మధుసూదన్ కుటుంబసభ్యులు ఉగ్రవాదుల చేతిలో మరో ప్రాణం పోకుండా ఉగ్రవాదులు లేకుండా గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. ఎన్ని యుద్ధాలు చేసినా పోయిన తన కొడుకును తిరిగి తెచ్చివ్వలేరంటూ మధుసూదన్ తల్లి పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. తనలా మరో తల్లి కడుపు కోతకు గురికాకుండా ఉగ్రవాదులను అంతం చేయాలని కోరుకున్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న అన్నను కోల్పోయామని మధుసూదన్ సోదరి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.ఆపరేషన్ సిందూర్ తమ కుటుంబానికి ఊరట కలిగిస్తోందని అన్నారు. అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కోరారు.

ఉగ్రదాడి
నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్రావు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవారు. వేసవి సెలవులు కావటంతో కశ్మీర్ అందాలను చూద్దామని పహల్గాం వెళ్లారు. అయితే అనుకోకుండా జరిగిన ఉగ్ర దాడిలో మధుసూదన్ ప్రాణాలు కోల్పోయారు. కావలిలోని కుమ్మరవీధిలో మధుసూదన్ తల్లిదండ్రులు తిరుపాల్, పద్మావతి నివాసముంటున్నారు. మధుసూదన్12 ఏళ్ల క్రితమే బెంగళూరులో స్థిరపడ్డారు. మరోవైపు మధుసూదన్తో పాటుగా విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి కూడా పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు.
Read Also :Andhra Pradesh: ఈ నెల 20 నుంచి మున్సిపల్ ఉద్యోగుల సమ్మె