జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ లోకి చొరబడి వారి రక్షణ వ్యవస్థల్ని ధ్వంసం చేయడంతో పాటు ఉగ్రవాదుల శిబిరాల్ని కూడా మట్టుబెట్టిన భారత్ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా భారత్ లో చొరబాటుకు, దాడులకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో భారత్ లో పలు టీవీ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్ ఫారాలు దేశం మీద జరుగుతున్న ఉగ్రదాడుల్ని లైవ్ లో చూపించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. వీటిపై కేంద్రం సీరియస్ అయింది.దేశ రక్షణ, భద్రతా దళాల కార్యకలాపాలకు సంబంధించిన వార్తల ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటువంటి సున్నితమైన అంశాల ప్రత్యక్ష ప్రసారాలు(Live broadcasts)’సన్నిహిత వర్గాల సమాచారం’ అంటూ రాసే కథనాల విషయంలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీడియా సంస్థలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అన్ని మీడియా ఛానెళ్లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులకు ఒక సలహా ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు గత నెలలో విడుదల చేసిన మార్గదర్శకాలను పునరుద్ఘాటించింది.
బయటకు
జాతీయ భద్రత దృష్ట్యా, రక్షణ కార్యకలాపాలు లేదా భద్రతా దళాల కదలికలకు సంబంధించి ఎలాంటి రియల్ టైమ్ కవరేజీ, దృశ్యాల ప్రసారం లేదా ‘సన్నిహిత వర్గాల సమాచారం’ ఆధారిత వార్తలను ప్రచురించవద్దని మంత్రిత్వ శాఖ(Union Ministry of Information and Broadcasting)స్పష్టం చేసింది. సమస్యాత్మక సమాచారం ముందుగానే బయటకు పొక్కితే, అది శత్రు మూకలకు అనుకూలంగా మారే ప్రమాదం ఉందని, తద్వారా సైనిక చర్యల సమర్థతకు, సిబ్బంది భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.అటువంటి సున్నితమైన లేదా మూలాధార సమాచారాన్ని బహిర్గతం చేయడం వలన కార్యాచరణ సామర్థ్యం దెబ్బతింటుందని తెలిపింది. అలాగే ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని తెలిపింది. కార్గిల్వార్, 26/11 దాడులు, కాందహార్ హైజాక్ వంటి గత సంఘటనలు అకాల నివేదికల ప్రమాదాలను నొక్కి చెబుతున్నాయని గుర్తుచేసింది.

ప్రకారం
కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ (సవరణ) నిబంధనలు, 2021లోని రూల్ 6(1)(p)ని అన్ని టీవీ ఛానెళ్లు తప్పనిసరిగా పాటించాలని గతంలోనే సూచించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిబంధన ప్రకారం, “భద్రతా దళాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నప్పుడు, ఆ ఆపరేషన్ పూర్తయ్యే వరకు ప్రభుత్వం నియమించిన అధికారి ఇచ్చే నిర్దిష్ట వ్యవధుల్లోని సమాచారాన్ని మాత్రమే ప్రసారం చేయాలి, ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతి లేదు” అని స్పష్టం చేసింది.ఇటువంటి ప్రసారాలు కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ (సవరణ) నిబంధనలు, 2021కి విరుద్ధమని, అలాంటి వాటిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. అందువల్ల, జాతీయ భద్రత దృష్ట్యా అన్ని టీవీ ఛానెళ్లు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, భద్రతా దళాల కదలికలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను చేయవద్దని సూచించింది. ఆయా కార్యకలాపాలు ముగిసే వరకు ప్రభుత్వం నియమించిన అధికారి ద్వారా ఎప్పటికప్పుడు అందించే సమాచారానికే మీడియా పరిమితం కావాలని కోరింది.
Read Also: Robert Prevost: కొత్త పోప్గా రాబర్ట్ ప్రవోస్ట్