ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో సభ జరిగే ప్రాంతానికి 5 కి.మీ. పరిధిని నోఫ్లై జోన్గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని పర్యటన పూర్తయ్యే వరకు డ్రోన్ ఎగురవేయడానికి కూడా అనుమతి ఉండబోదని డ్రోన్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కలా ఇవే నిబంధనలు అమలవుతాయని అధికారులు తెలిపారు. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని పర్యటనకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆయన తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టులో దిగుతారు. అక్కడ ఆయనకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్వాగతం పలుకుతారు.విమానాశ్రయం నుంచి ప్రధాని హెలికాప్టర్లో అమరావతికి చేరుకుంటారు. ఇప్పటికే 4 హెలికాప్టర్లు విమానాశ్రయానికి చేరుకున్నాయి. వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన వెళ్లేలా రెండు మార్గాలను ఎంపిక చేశారు. విమానాశ్రయం నుంచి చెన్నై- కోల్కతా జాతీయ రహదారిపైకి వచ్చి కేసరపల్లి – గూడవల్లి – ఎనికేపాడు – రామవరప్పాడు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తారు. బెంజిసర్కిల్, ప్రకాశం బ్యారేజి, ఉండవల్లి కరకట్ట మీదుగా రాజధానికి వెళ్తారు. ఈ మార్గంలో కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఇదికాకుండా మరో మార్గాన్ని కూడా సిద్ధం చేశారు. ఆ సమయంలో రోడ్డు షో నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. రోడ్డు షో ఉంటే ఆ ప్రాంతం కూడా నోఫ్లై జోన్ పరిధిలోకి వస్తుంది. ఎక్కడా బెలూన్లు కూడా ఎగరేయకూడదని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రజలకు సూచించారు.
తాత్కాలిక
సభకు తరలివచ్చే లక్షల మందికి అవసరమైన ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలను రెవెన్యూ శాఖ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 మంది ఆర్డీఓలు, 200 మంది తహసీల్దార్లు, 200 మంది సర్వేయర్లకు అప్పగించింది. వీరు సభకు వచ్చిన వారికి సౌకర్యాల కల్పన, వాహనాల పార్కింగ్ పరంగా సమస్యలు తలెత్తకుండా చూడడం వంటి విధులు నిర్వర్తిస్తారు. సభాస్థలి వద్ద ముందు జాగ్రత్తగా అత్యవసర వైద్యానికి వీలుగా 30 వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. సభాస్థలి పరిసర ప్రాంతాల్లో మూడుచోట్ల పది చొప్పున పడకలతో తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. 21 అంబులెన్సులు సిద్ధంగా ఉంటాయని నిర్వహనాధికారులు తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్, మరో కార్పొరేట్ ఆసుపత్రిలోనూ ప్రత్యేక వార్డులను సిద్ధం చేశారు.

బృందం
సభకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశామని, సభకు వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం ఉండదని మంత్రుల బృందం పేర్కొంది. ఈ బృందంలో సభ్యులైన పయ్యావుల కేశవ్, నారాయణ, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర గురువారం సభా ప్రాంగణంలో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి పనుల పునఃప్రారంభోత్సవంతో రాష్ట్ర ప్రజల్లో ఉత్సాహం కనిపిస్తోందన్నారు.
Read Also: Narendra Modi: మోదీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఘన స్వాగతం