టీమిండియా ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తన అద్భుతమైన ప్రదర్శనతో అభిమానుల క్రికెట్ బోర్డుల ప్రశంసలు కూడా అందుకుంటున్నాడు. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాల్గవ టెస్టులో భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో నితీష్ తన తొలి టెస్ట్ సెంచరీని నమోదు చేసి జట్టుకు విలువైన కాపాడిన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ప్రదర్శన తర్వాత అతనిపై కాసుల వర్షం కురుస్తోంది. నితీష్ సెంచరీకి స్పందనగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ రూ.25 లక్షలు ప్రైజ్ మనీగా అందిస్తామని ప్రకటించింది. ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, నితీష్ కుమార్ రెడ్డి లాంటి కుర్రాళ్లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం ఆంధ్రప్రదేశ్ క్రికెట్ గర్వకారణం. అతని అద్భుత ప్రదర్శనను గుర్తించి ప్రైజ్ మనీ ఇస్తున్నాం, అని చెప్పారు.

నితీష్ కేవలం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచే కాకుండా బీసీసీఐ నుంచి కూడా ప్రత్యేక రివార్డ్స్ అందుకోనున్నట్లు సమాచారం. NDTV కథనం ప్రకారం, బీసీసీఐ టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాళ్లకు రూ.5 లక్షల నగదు బహుమతిని అందజేస్తుంది. ఇది వారి రెగ్యులర్ మ్యాచ్ ఫీజు నుండి విడిగా ఉంటుంది. అంతేకాదు, డబుల్ సెంచరీ చేసిన ఆటగాళ్లకు బీసీసీఐ రూ.10 లక్షల రివార్డ్ను ఇస్తుందట. భారత్-ఆస్ట్రేలియా నాలుగో టెస్టు మూడో రోజు ఆటలో, భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో నితీష్ 8వ బ్యాట్స్మన్గా క్రీజ్లోకి వచ్చి తన దూకుడైన ఆటతీరుతో భారత ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. 105 పరుగులతో నాటౌట్గా నిలిచిన నితీష్ సెంచరీతో జట్టును ఆత్మవిశ్వాసం నింపాడు.నితీష్ ప్రదర్శన అతనిని టీమిండియాలో కీలక ఆటగాడిగా మార్చే అవకాశం ఉంది. టెస్టుల్లో సెంచరీ చేయడం ద్వారా అతను క్రికెట్ ప్రేమికుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఈ సెంచరీతో నితీష్ కుమార్ రెడ్డి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. అతని ప్రదర్శన భారత జట్టుకు ఉపయోగపడటమే కాకుండా, యువ క్రికెటర్లకు స్ఫూర్తి గాథగా నిలుస్తుంది.