ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఈసారి 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే ప్రతిసారి ఆర్థిక కేటాయింపుల గురించే కాదు.. నిర్మలా సీతారామన్ ధరించే చీరలపైనా ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆమె బడ్జెట్ సమయాల్లో ప్రత్యేకంగా ఉండే చీరల్ని ధరిస్తూ వస్తున్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల్ని, హుందాతనాన్ని ప్రదర్శించేలా ఆమె చీరల్ని ఎంచుకుంటున్నారు. ఎక్కువగా ఆమె చేనేత చీరల్నే ఇష్టపడుతుంటారు. అవే ఎక్కువగా బడ్జెట్ సమయంలో ధరిస్తుంటారు. 2025 బడ్జెట్ వేళ కూడా చేనేతపై ఇష్టాన్ని ప్రదర్శించారు. బంగారు వర్ణం అంచుతో ఉన్న క్రీమ్ కలర్ రంగు చీరను ధరించారు.

బిహార్లోని మధుబని కళకు సంబంధించిన చిత్రాలు నిర్మలా సీతారామన్ చీరపై కనిపించాయి. దీంతో ఆమె బడ్జెట్ చీరపై వెంటనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 2021లో పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారి దేవి ఇచ్చిన చీరనే నిర్మలమ్మ నేడు కట్టుకున్నారు. గతంలో నిర్మలా సీతారామన్.. మిథిలా ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో క్రెడిట్ అవుట్రీచ్ యాక్టివిటీ కోసం మధుబనీని సందర్శించారు నిర్మలా సీతారామన్. ఈ క్రమంలోనే దులారి దేవీని కలవగా.. ఆమె ఇచ్చిన చీరను ఇప్పుడు బడ్జెట్లో ప్రతిబింబించేలా ధరించినట్లు తెలుస్తోంది. 2019లో NDA ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. తొలిసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ అప్పటినుంచి బడ్జెట్ ప్రవేశపెడుతూనే ఉన్నారు. 2024 మధ్యంతర బడ్జెట్ సమయంలో హ్యాండ్లూమ్ చీరనే ఎంచుకున్నారు. తెలుపు రంగు, గోల్డ్ మోటిఫ్స్తో ఉన్న మెజెంటా బోర్డర్ సిల్క్ శారీలో కనిపించారు.