ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బియ్యం కార్డులకు సంబంధించి కీలక ఆదేశాలుజారీ చేశారు. అధికారులకు కొన్ని సూచనలు చేశారు. వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా ఈ నెల 15 నుంచి బియ్యం కార్డుల సేవల్ని అందించాలని చెప్పారు. రైస్ కార్డులో పేర్లు ఉండి, GSWWS సమాచార నిధిలో కనిపించని 79,173 మంది వివరాలను సరి చేయాలని ఆదేశించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. రేషన్ సరకుల పంపిణీలో ఎలాంటి లోటుపాట్లు జరగకూడదని అన్నారు.కొత్త బియ్యం కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 7న మొదలైందని,దీనికి మంచి స్పందన వస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కొత్త కార్డులతో పాటు విభజన, చేర్పులు, తొలగింపులు వంటి ఏడు రకాల(7 Types) సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. గత ఖరీఫ్లో 35.94 లక్షల టన్నులు, రబీలో 14.28 లక్షల టన్నుల ధాన్యం సేకరించి డబ్బులు జమ చేశామని అధికారులు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి తెలిపారు. దీపం-2 కింద ఉచిత సిలిండర్లను కూడా పంపిణీ చేయాలని చెప్పారు. ధాన్యం సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. ప్రజలకు సేవలు సక్రమంగా అందాలన్నారు.

క్యూఆర్ కోడ్
ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బుధవారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల చివరి వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్లో క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు ఇస్తారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆరు నెలల రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ను(QR CODE) స్కాన్ చేస్తే ఆరు నెలల రేషన్ వివరాలు తెలుస్తాయి. రేషన్ కార్డు ఉన్నవాళ్లు ఈకేవైసీ చేసుకుంటే మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అని అధికారులు చెప్పారు. కొత్త రేషన్ కార్డు పొందాలన్నా, పేరు మార్చుకోవాలన్నా హౌస్హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. రేషన్ కార్డులో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లను చేర్చవచ్చు. కార్డు వద్దనుకుంటే తొలగించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ విభజనలో భాగంగా కొత్త కార్డు ఇస్తారు. చిరునామా మార్చుకోవచ్చు. తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు రేషన్ కార్డు లేకపోతే కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. పాత రేషన్ షాపులు రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మొత్తం మీద ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు దరఖాస్తులు చేసుకుంటున్నారు.ఇక ఇప్పటికే కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సాంకేతిక ఆధారిత విధానానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పలు జిల్లాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఆధార్, మొబైల్ నంబర్ సహా వివరాలతో కొత్త కార్డులకు దరఖాస్తు చేస్తున్నారు.
Read Also: TTD: టీటీడీ భక్తులు అసంతృప్తితో వెళ్లిపోతున్నారు:వెంకయ్య చౌదరి