ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే పనిలో ఉంది. ఇప్పటికే పలు కంపెనీలు, పరిశ్రమలు రాష్ట్రానికి రాగా మరికొందరు పారిశ్రామివేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నారు. తాజాగా ఏపీకి మరో పరిశ్రమ రాబోతోంది, తిరుపతి జిల్లా మేనకూరు ఇండస్ట్రియల్ ఏరియాలో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. రూ.229.82 కోట్ల పెట్టుబడితో బయోఫ్యూయల్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ బయో ఇథనాల్ ఉత్పత్తి, విద్యుత్ప్లాంటు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. పెళ్లకూరు మండలం పాలచ్చూరు రెవెన్యూ పరిధిలో దీనిని ఏర్పాటు చేయబోతున్నారు.
ఇథనాల్ పరిశ్రమ
ఏపీ ప్రభుత్వంతో బయోఫ్యూయల్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఈ ఇథనాల్ ప్లాంట్కు ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీకి ఏపీఐఐసీ 24 ఎకరాల భూమిని కేటాయించింది. తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న ఈ ప్లాంటు ద్వారా వ్యవసాయ బయో వ్యర్థాల నుంచి ఇథనాల్, విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో వెంకటాచలం మండలంలో గతేడాది రూ.900 కోట్లతో రెండు ఇథనాల్ పరిశ్రమలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మేనకూరు ఇండస్ట్రియల్ ఏరియాలో మరో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకాబోతోంది.ఈ ఇథనాల్ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి మరో అప్డేట్ కూడా వచ్చింది. మే 22న స్థానికంగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ ఏర్పాటుపై స్థానికంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు అధికారులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2030 నాటికి దేశంలో 20 శాతం ఇథనాల్తో కూడిన పెట్రోల్ను వినియోగించేందుకు ఇథనాల్ ఉత్పత్తి పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఇథనాల్ పరిశ్రమ తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయంటున్నారు.

ఎల్జీ సంస్థ
ఇప్పటికే తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. మరికొన్ని సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ఇటీవల ఎల్జీ సంస్థ అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది వచ్చే నెలలో శంకుస్థాపన చేసే అవకాశం ఉందంటున్నారు.
Read Also: 10th Class Results : ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల..