భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పద అంశంగా నిలిచిన ఎమర్జెన్సీని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ రూపొందించిన చిత్రం “ఎమర్జెన్సీ“. ఈ సినిమా విడుదలతో మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎమర్జెన్సీపై వివిధ వర్గాలు తమ అభిప్రాయాలను గట్టిగా వ్యక్తం చేస్తుండటంతో, కంగనా ఈ చిత్రంతో కొత్త చరిత్ర సృష్టించడమే కాకుండా అనేక విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు.సినిమా ప్రకటించినప్పటి నుంచే “ఎమర్జెన్సీ” అనేక వివాదాలకు కేరాఫ్గా మారింది. కంగనా ఈ సినిమాను తెరకెక్కించే క్రమంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నారు.
సినిమా పూర్తయిన తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ పొందేందుకు కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. చివరికి అన్ని సమస్యలను అధిగమించిన ఆమె, శుక్రవారం “ఎమర్జెన్సీ”ను విడుదల చేశారు.సినిమా విడుదల తర్వాత పంజాబ్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. పలు సిక్కు సంఘాలు థియేటర్ల ముందు నిరసనకు దిగాయి. అమృత్సర్లోని థియేటర్ల వద్ద ఎస్జీపీసీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సిక్కు సంఘాల నేతలు ఈ చిత్రంపై బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు. థియేటర్ల వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పంజాబ్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది.సిక్కు సంఘాల నేతలు కంగనాపై విమర్శలు గుప్పించారు.
ఎంపీగా ఎన్నికైన తర్వాత ఇలాంటి వివాదాస్పద చిత్రాలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.ఇందిరా గాంధీ జీవితకథను కమర్షియల్ హంగుల కోసం వక్రీకరించారంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పంజాబ్లో నిరసనలు కొనసాగుతున్నప్పటికీ, మిగతా రాష్ట్రాల్లో సినిమా విడుదల పట్ల ఎటువంటి సమస్యలు లేవు. పంజాబ్లో మాత్రం పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఆందోళనగా మారింది.”ఎమర్జెన్సీ” కేవలం ఒక సినిమా మాత్రమే కాకుండా, భారత రాజకీయ చరిత్రలో మరో కోణాన్ని చూపించే ప్రయత్నం. అయితే ఈ ప్రయత్నం కంగనాకు ప్రశంసలతో పాటు విమర్శలను కూడా తీసుకువచ్చింది. ఈ చిత్రం చుట్టూ ఉన్న వివాదాలు ఇప్పట్లో చర్చలకు కేంద్రంగా నిలిచేలా ఉన్నాయి.