కాకినాడకు చెందిన ఈ 72 ఏళ్ల వృద్ధురాలు చదువుకోవాలనే ఆసక్తి ఉంటే వయసు ప్రతిబంధకం కాబోదని నిరూపించారు. నగరానికి చెందిన పోతుల వెంకటలక్ష్మి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పరీక్ష నీట్ రాశారు. ఆమె ఉత్సాహాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. పరీక్షా హాలులో ఆమె ధైర్యంగా, నవ్వుతూ అడుగు పెట్టిన దృశ్యం ఎంతో మందికి మోటివేషన్గా నిలిచింది. ఈ వయస్సులోనూ విద్యపై ఉన్న ఆసక్తి ఆమెను ఈ స్థాయికి తీసుకువచ్చింది. ఆమె చూపించిన పట్టుదల – యువతకు ఒక గొప్ప ఉదాహరణ. “ఇప్పటికీ చదవాలనిపిస్తోంది, నాలో ఆసక్తి చావలేదు,” అని ఆమె చెప్పిన మాటలు పరీక్ష కేంద్రం వద్ద ఉన్నవారికి ఆశ్చర్యాన్ని కలిగించాయి.

తల్లీకూతుళ్ల కల: NEET పరీక్షకు ఇద్దరూ హాజరు
తల్లీ కూతుళ్లు ఇద్దరూ ఒకేసారి NEET పరీక్ష రాయడం అరుదైన సంఘటన. ఇది ఖమ్మం జిల్లాలో ఆదివారం జరిగింది. తన కూతురుతో పాటు ఓ మహిళ ఆదివారం జరిగిన నీట్ పరీక్ష రాశారు. అయితే, తల్లీకూతుళ్లు ఇద్దరూ వేర్వేరు జిల్లాల్లో పరీక్ష రాశారు. సూర్యాపేట జిల్లాలోని మంచ్యానాయక్ తండాకు చెందిన భూక్యా సరిత(38) ప్రస్తుతం ఆర్ఎంపీగా పనిచేస్తున్నారు. వివాహం కారణంగా బీఎస్సీ నర్సింగ్ చివరి సంవత్సరంలో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. సరిత, భూక్యా కిషన్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు కావేరిని డాక్టర్ చేయాలనే ఉద్దేశంతో నీట్ పరీక్షకు శిక్షణ ఇప్పించారు. ఆ సమయంలోనే తాను కూడా పరీక్ష రాయాలని సరిత నిర్ణయించుకుని కూతురుతో పాటు సిద్ధమయ్యారు. ఆదివారం తల్లి సరిత సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, కుమార్తె కావేరి ఖమ్మం ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రంలో పరీక్ష రాశారు.
తల్లి కూడా తనతో పాటే నీట్ పరీక్ష రాయటం సంతోషంగా ఉందని ఇద్దరం కలిసి ఖమ్మంలో ఒకే గదిలో ఉండి కోచింగ్ తీసుకున్నామని కూతురు కావేరి చెబుతోంది. భర్త సహకారంతో పిల్లలతో పాటు తాను కూడా కోచింగ్ తీసుకుని నీట్ ఎగ్జామ్ రాసానని సరిత చెబుతోంది. చదువుకోవాలనే పట్టుదల ఉంటే వయస్సు, వివాహం, కుటుంబ బాధ్యతలు ఏమాత్రం అడ్డు కాదని సరిత చెబుతున్నారు. కూతురుతో పాటు తల్లి కూడా నీట్ ఎగ్జామ్ రాయడాన్ని పలువురు అభినందిస్తున్నారు.
Read also: AP DSC: ఏపీ మెగా డీఎస్సీకి తాజా ఉత్తర్వులు