ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని మళ్లీ ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు కీలకంగా మారబోతుంది. మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అమరావతిలో అడుగుపెట్టి, అధికారికంగా నిర్మాణ పునఃప్రారంభ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులకు ఎంతో ఆనందదాయకమైన విషయం.

మంత్రి నారాయణ స్పందన
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని పర్యటనలో ఎలాంటి లోపాలు ఉండకూడదు. సమయాన్ని అత్యంత సమర్ధవంతంగా వినియోగించుకోవాలి. భద్రతా సన్నాహాలు అత్యున్నత ప్రమాణాలతో అమలు చేయాలని అధికారులను ఆదేశించాం అని తెలిపారు. ప్రధాని పర్యటన కేవలం గంటన్నర మాత్రమే ఉంటుందని, భద్రతా కారణాల దృష్ట్యా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రధాని కాన్వాయ్ సాఫీగా సాగేందుకు 8 మార్గాలను గుర్తించామని, సభకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం 11 ప్రాంతాలను సిద్ధం చేస్తున్నామని మంత్రి వివరించారు.
రైతుల సన్మానం – అమరావతి పోరాటానికి గుర్తింపు
చంద్రబాబు నాయుడు సూచన మేరకు, గత ఐదేళ్లుగా రాజధాని కోసం పోరాడిన అమరావతి రైతుల్లో కనీసం ముగ్గురు లేదా నలుగురు రైతులను ప్రధానమంత్రి మోదీ సమక్షంలో సన్మానించనున్నారని మంత్రి నారాయణ తెలిపారు. ఇది వారికి మానసికంగా పెద్ద ఊరటనిచ్చే ఘటనగా మారనుంది. అదనపు భూముల ల్యాండ్ పూలింగ్ విషయంలో ప్రజల అంగీకారంతోనే చర్యలు తీసుకుంటామని, లేదంటే భూసేకరణ మార్గాన్ని పరిశీలిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. మంత్రి నారాయణ పేర్కొన్నట్లు, రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నగర నిర్మాణం జరుగుతోంది. ఇది కేవలం భవనాల నిర్మాణం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆధారశిల అని వ్యాఖ్యానించారు.
Read also: High alert : ఉగ్ర దాడి.. తిరుమలలో హై అలెర్ట్..!