అమరావతి పునర్ నిర్మాణానికి శంకుస్థాపన – ప్రధాని మోదీ, మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయ, అభివృద్ధి రంగంలో మరో కీలక మలుపు తిరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతిలో పునర్ నిర్మాణ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, రాష్ట్రానికి అభివృద్ధి నూతన దిశను చూపించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వెలగపూడిలో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రసంగిస్తూ, గత ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతిని నిర్వీర్యం చేయడానికి గత ప్రభుత్వం వ్యక్తిగత కక్షతో పని చేసిందని ఆయన ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో ఐదేళ్ల పాటు కాలయాపన మాత్రమే జరిగిందని, రాజధానిలో ఒక్క ఇటుక కూడా వేయలేదని ధ్వజమెత్తారు.
రైతుల త్యాగం అమరావతికి పునాది
అమరావతిని సాధించేందుకు 1,631 రోజుల పాటు అలుపెరగని పోరాటం చేసిన రైతుల త్యాగాలను లోకేశ్ గుర్తుచేశారు. ఉద్యమంలో పాల్గొన్న రైతులపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా, మహిళలపై దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. “ఎన్ని అడ్డంకులు వచ్చినా మొక్కవోని దీక్షతో పోరాడిన ఆ రైతులు ఈ విజయానికి కారణం. వారికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను” అని లోకేశ్ పేర్కొన్నారు. “ఆపడానికి, పీకడానికి అమరావతి ఎవరి ఇంటి పెరటి మొక్క కాదు, ఇది ప్రజల గుండెల్లో దాచుకున్న రాజధాని” అని పేర్కొంటూ, అమరావతికి ప్రజల మద్దతును స్పష్టం చేశారు.
‘అన్స్టాపబుల్ అమరావతి’ – కేంద్రంతో డబుల్ ఇంజన్ దూసుకెళ్తుంది
ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన అభివృద్ధి పనులను ఇక ఎవరూ ఆపలేరని, ఇది ఇక ‘అన్స్టాపబుల్’ అని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి చేసిన శంకుస్థాపనను ఆపే ధైర్యం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని, కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని పేర్కొన్నారు. అమరావతితో పాటు అన్ని జిల్లాల్లో సమాన అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.
ఉద్యోగాల జాతర – ఐటీ, ఫార్మా, ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులు
రాబోయే ఐదేళ్లలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, దాంతో పాటు 20 లక్షల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని లోకేశ్ వెల్లడించారు. ఇప్పటికే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు చెప్పారు. విశాఖపట్నంలోని ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, అనకాపల్లిలో ఆర్సెల్లార్ మిట్టల్, రామాయపట్నంలో బీపీసీఎల్, తిరుపతిలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్, రాయలసీమలో రెన్యూవబుల్ ఎనర్జీ, ప్రకాశంలో రిలయన్స్ సీబీజీ వంటి ప్రాజెక్టులు లక్షల కోట్ల పెట్టుబడులు మరియు వేలాది ఉద్యోగ అవకాశాలను తెచ్చిపెడతాయని వివరించారు.
‘నమో’ – దేశాన్ని కాపాడే మిస్సైల్!
జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన లోకేశ్, భారత్పై చీటికీ మాటికి ధైర్యంగా నిలబడే శక్తి ప్రధాని మోదీలో ఉందన్నారు. “వారు భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరు. సింహం ముందు ఆటలు ఆడితే, దాని దెబ్బ ఎలా ఉంటుందో పాకిస్థాన్కు తెలుస్తుంది. నమో అంటే ఒక్క మిస్సైల్.. ఆ మిస్సైల్ మోదీ. ఆయన దెబ్బకు వరల్డ్ మ్యాప్ నుంచే పాక్ మిస్సింగ్ అయిపోతుంది!” అంటూ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు.
కేంద్రం కులగణనతో సంచలనం – మోదీకి ప్రజల మద్దతు
కేంద్రం ఇటీవల తీసుకున్న కులగణన నిర్ణయం దేశ రాజకీయాల్లో సంచలనం కలిగించిందని, దశాబ్దాలుగా ఎవరూ తీసుకోలేని నిర్ణయాన్ని మోదీ ధైర్యంగా తీసుకున్నారని లోకేశ్ అన్నారు. నమోకు అమరావతిపై మక్కువ ఉందని, బిజీ షెడ్యూల్ మధ్యన కూడా రాష్ట్రానికి వచ్చినట్లు గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభంతో పాటు, రైల్వే జోన్, ఎన్టీపీసీ, డ్రగ్ పార్క్లకు నిధులు మంజూరు చేయడం మోదీ నిబద్ధతకు నిదర్శనమన్నారు.
read also: Fly Zone: మోదీ సభకు ఐదు కి.మీ వరకు నోఫ్లై జోన్