ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ దావోస్ పర్యటనలో భాగంగా భారత్ ఫోర్జ్ సంస్థ వైస్ చైర్మన్ కళ్యాణితో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రంలో రక్షణ పరికరాల తయారీకి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ దిశగా త్వరగా చర్యలు చేపట్టాలని లోకేశ్ కోరారు. ఆంధ్రప్రదేశ్ను రక్షణ పరికరాల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
లోకేశ్ రక్షణ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి (R&D) శిక్షణ కేంద్రాలు, ప్రత్యేక కోర్సులు ప్రారంభించాలనే ప్రస్తావన చేశారు. ఈ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోని ITIల్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిభావంతులైన యువతకు ఉద్యోగ అవకాశాలు అందించడంలో ఈ చర్యలు ముఖ్య పాత్ర పోషిస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు. సమావేశంలో భాగంగా .. మడకశిర పరిధిలో రూ.2400 కోట్ల వ్యయంతో రక్షణ పరికరాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేసే ప్రణాళికలను భారత్ ఫోర్జ్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి తక్షణ ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా దేశవ్యాప్తంగా రక్షణ రంగానికి కీలకమైన తోడ్పాటును అందించనుంది.
భారత్ ఫోర్జ్ సంస్థ ప్రతినిధులు రాష్ట్రంలో పరిశోధన, శిక్షణ, తయారీ ప్రక్రియలను అభివృద్ధి చేసే ప్రణాళికలకు తమ మద్దతును వ్యక్తం చేశారు. సంస్థ తరఫున మరిన్ని పెట్టుబడులు APలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలకు మరింత బలాన్ని చేకూరుస్తుందని ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ భేటీతో ఆంధ్రప్రదేశ్ను రక్షణ పరికరాల తయారీలో ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి మరింత ప్రోత్సాహం లభించింది. మడకశిరలో యూనిట్ స్థాపన ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి, రాష్ట్రం ఆర్థికంగా ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.