మంగళగిరిలో స్త్రీశక్తి పునరుద్ధరణకు నారా లోకేశ్ విశేష కృషి
ఆంధ్రప్రదేశ్లో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ స్వంత నియోజకవర్గం అయిన మంగళగిరి ప్రాంతంలో వేలాది ఇళ్లలో స్వయం ఉపాధి పసుపు రంగులో కుట్టు మిషన్లు మనకు దర్శనమిస్తాయి. ఈ మిషన్లు అన్ని ఉచితంగా మహిళలకు అందజేయబడ్డవే. 2022 నుంచి నేటివరకు నారా లోకేశ్ తన సొంత నిధులతో చేపట్టిన “స్త్రీశక్తి” పథక ఫలితంగా ఈ విశేష దృశ్యం మనకు కనువిందు చేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మహిళలు తమ అభిరుచి ప్రకారం టైలరింగ్, బ్యూటీషియన్ రంగాల్లో ప్రావీణ్యం సాధించేందుకు అవసరమైన శిక్షణ, పరికరాలు ఉచితంగా అందించబడ్డాయి.

ఓటమిని ఎదిరించి సేవ పంథాలోకి
2019 శాసనసభ ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేశ్ స్వల్ప తేడాతో ఓటమి పాలైనా, ఆ అపజయాన్ని వ్యక్తిగతంగా తీసుకోకుండా సేవ పంథాలోకి అడుగుపెట్టారు. తనను ఆదరించిన ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. “ప్రజల బాగోగులు చూసుకోవడం ఒక బాధ్యత” అనే భావనతో అధికారంలో లేకపోయినా తానిచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేశారు. చేనేత కార్మికులు, స్వర్ణకారులు, చిన్న చిన్న వ్యాపారులు, మహిళల అవసరాలను గుర్తించి ఆయా వర్గాల కోసం ప్రత్యేక పథకాలు రూపొందించారు. వాటిని పూర్తి స్థాయిలో తన సొంత ఖర్చులతో అమలు చేశారు.
‘స్త్రీశక్తి’తో మహిళలకు భరోసా
తల్లి నందమూరి భువనేశ్వరి ఆశీస్సులు, భార్య బ్రాహ్మిణి ప్రోత్సాహంతో నారా లోకేశ్ “స్త్రీశక్తి” అనే వినూత్న పథకాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని కులాల, మతాల మహిళలకు బ్యూటీషియన్ కోర్సులు, టైలరింగ్ శిక్షణ ఉచితంగా అందించబడుతోంది. ఇప్పటివరకు 3,508 మంది మహిళలు ఈ శిక్షణను పూర్తి చేసుకుని, వారికి నాణ్యమైన కుట్టు మిషన్లు కూడా ఉచితంగా అందించారు. ఇప్పుడు వీరంతా తమ ఇంట్లోనే లేదా షాపులు ప్రారంభించి ఉపాధిని సంపాదిస్తున్నారు.

ఆదర్శప్రాయంగా మారిన పసుపు మిషన్లు
స్త్రీశక్తి పథకం మూడు సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతోంది. శిక్షణ పొందిన మహిళలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. వారి జీవితాల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒక కుటుంబాన్ని ఆదుకునే శక్తి ఇప్పుడు ఆ మహిళల చేతుల్లోకి వచ్చింది. పసుపు రంగు మిషన్ ఒక సాధారణ పరికరం కాదని, అది వారి జీవిత మార్గాన్ని మార్చిన ఉపాధి మార్గమని వారు చెబుతున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం ఇతర ప్రాంతాలకు కూడా ప్రేరణగా నిలుస్తోంది.
ప్రజాసేవకు నిదర్శనం లాంటిది
ఈ పథకానికి ఖర్చైన ప్రతి రూపాయిని నారా లోకేశ్ తన స్వంత జేబు నుంచే ఖర్చు చేశారు. ఇది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అరుదైన విషయమే. అధికారం లేకుండా కూడా, ఆదాయ వనరులపై ఆధారపడకుండా సేవ చేయాలన్న ఆశయంతో ఆయన చేస్తున్న ఈ కృషి ప్రజాసేవకు పరిపూర్ణ నిదర్శనంగా నిలుస్తోంది. మహిళల శక్తిని గుర్తించి, స్వయం ఉపాధికి అనుకూల వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఆయన నూతన రాజకీయ సంస్కృతికి బాటలు వేస్తున్నారు.
Read also: Andhra University: ఉద్రిక్తతల నేపథ్యంలో ఆంధ్ర వర్సిటీ హాస్టళ్ల మూసివేత