ఉత్తరప్రదేశ్లోని మీరట్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి.భర్త సౌరభ్ రాజ్పుత్ను హత్య చేసిన తర్వాత నిందితురాలు ముస్కాన్ రస్తోగి తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లింది. ఒకవైపు భర్తను హతమార్చిన ఈ జంట, మరోవైపు హోలీ వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు.
హోలీ వేడుకలు
ముస్కాన్, సాహిల్ ఇద్దరూ మార్చి 17న హిమాచల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.ప్రియుడితో కలిసి రంగులు పూసుకుని డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.హత్య చేసిన 11 రోజుల తర్వాత కూడా ఆమె నిశ్చింతగా ఉన్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.హిమాచల్ ప్రదేశ్లో సాహిల్కు కేక్ తినిపిస్తూ ‘హ్యాపీ బర్త్ డే’ అని చెప్పి ముద్దు పెడుతున్న మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇంకో వీడియోలో ముస్కాన్ మంచులో నడుస్తూ ఎంజాయ్ చేస్తుండటం కనిపించింది.
ప్లాన్ ప్రకారం
కుమార్తె పుట్టినరోజు కోసం విదేశాల నుంచి వచ్చిన సౌరభ్ వేరే ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. అక్కడ తన తల్లి చేసిన ఒక వంటకాన్ని వెంట తెచ్చుకున్నాడు. దానిని వేడి చేసిన ముస్కాన్ అప్పుడే మత్తుపదార్థాలు కలిపింది. సౌరభ్ స్పృహ కోల్పోయాక, విచక్షణారహితంగా అతడిపై దాడి చేసి చంపేశారు. హత్యను ముందుగానే ప్లాన్ చేసిన నిందితులు,కత్తి, మత్తుపదార్థాలు కొనుక్కొని వచ్చారు. మృతదేహాన్ని విసిరేయడానికి నిర్మానుష్య ప్రాంతాలను వెతుక్కున్నారని పోలీసులు తెలిపారు.
కేసు నమోదు
పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.హత్య, మృతదేహాన్ని ముక్కలుగా నరకడం, ఆధారాలు తొలగించడం వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది.ముస్కాన్ కుటుంబం కూడా ఈ కేసుపై విచారణ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.
జుడీషియల్ కస్టడీ
పోలీసుల విచారణలో ముస్కాన్, సాహిల్ ఇద్దరూ హత్య చేసినట్టు ఒప్పుకున్నారు.ఈ కేసులో గట్టి ఆధారాలు దొరికినందున ఇద్దరినీ కోర్టులో హాజరు పరచారు.చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ (సిజెఎం) కోర్టు, ఇద్దరినీ 14 రోజుల జుడీషియల్ కస్టడీకి పంపింది.ప్రియుడి మోజులో పడిన ముస్కాన్ తన భర్త సౌరభ్ రాజ్ పుత్ ను ప్రియుడితో కలిసి అత్యంత పాశవికంగా హత్య చేసింది. సౌరభ్ మృతదేహాన్ని ప్రియుడు సాహిల్ తో కలిసి 15 ముక్కలు చేసి డ్రమ్ములో పూర్తిగా సిమెంట్ తో నింపి దాచేశారు. మార్చి 4న సౌరభ్ ను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి డ్రమ్ములో దాచేశారు. తన ప్రియుడు సాహిల్ కోసమే ముస్కాన్ సౌరభ్ ను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన అనంతరం వారిద్దరూ ఇంట్లో హాయిగా నిద్రించినట్లు తెలిసింది. అయితే తమ అల్లుడు చాలా మంచివాడని,సౌరభ్ ను చంపిన తమ కూతురిని ఉరితీయాలని ముస్కాన్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. లేదంటే తామే ముస్కాన్ ను చంపేస్తామన్నారు.