రోడ్డు ప్రమాదంలో ‘మిస్టర్ తెలంగాణ’ మృతి

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాడీ బిల్డర్‌, మిస్టర్‌ తెలంగాణ విజేత మహ్మద్‌ సోహైల్‌ (23) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. బైక్‌ను అతివేగంగా నడుపుతూ.. అదుపుతప్పి ఎదురుగా వస్తున్న స్క్రాప్ ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సోహైల్ తీవ్రంగా గాయపడడంతో స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగానే అతడు ప్రాణాలు కోల్పోయాడు.

సిద్దిపేట జిల్లాకు చెందిన సోహైల్‌ అనేక జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దక్షిణ భారత స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు. మిస్టర్‌ తెలంగాణ ఛాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచాడు. బాడీ బిల్డింగ్‌లో గొప్ప భవిష్యత్తు ఉన్న సోహైల్‌.. ఇంత చిన్నవయసులోనే మరణించడం పట్ల అతని కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.