ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా వెలగపూడి సచివాలయానికి చేరుకొని అక్కడ జరిగే సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటనలో భాగంగా అమరావతిలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.
మోడీ షెడ్యూల్
ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్నం 2:55 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్లో 3:15కు వెలగపూడికి చేరుకుంటారు. అనంతరం 3:30 గంటలకు సభాస్థలికి చేరుకుని, రాజధాని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సభ ముగిశాక సాయంత్రం 4:55 గంటలకు తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. ఈ సభకు సచివాలయ ఉద్యోగులంతా తప్పనిసరిగా హాజరుకావాలని సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
భద్రత విషయానికొస్తే, కేంద్ర–రాష్ట్ర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పాక్తో ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, ప్రధాని ప్రయాణించే మార్గాల్లో పటిష్ట చర్యలు తీసుకున్నారు. వర్షం పడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాన్ బీ కూడా సిద్ధం చేశారు. ప్రధాని వాహనం వెళ్లే మార్గంలో ప్రజలు స్వాగతం పలుకేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద, మోదీ పర్యటన విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నారు.
Read Also : Real Estate : అమరావతిలో మళ్లీ భూములకు రెక్కలు