ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోదలో ఏర్పాటు చేయనున్న అత్యాధునిక క్షిపణి పరీక్ష కేంద్రం రాష్ట్ర రాజధాని అమరావతికి ఒక మణిహారంగా నిలవనుంది. దేశ రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్ను కీలక స్థానంలో నిలబెట్టే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు తొలి దశ పనులకు (సుమారు రూ.1500 కోట్లు) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టనున్నారు. ఇది కేవలం కృష్ణా జిల్లాకే కాకుండా, మొత్తం అమరావతి రాజధాని ప్రాంత వ్యూహాత్మక ప్రాధాన్యతను ఇనుమడింపజేసే పరిణామం.రక్షణ పరిశోధన,అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఆధ్వర్యంలో, సుదీర్ఘ నిరీక్షణ (14 ఏళ్లు) తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. దేశ రక్షణ అవసరాలకు అనుగుణంగా క్షిపణి పరీక్షల నిర్వహణకు గుల్లలమోద భౌగోళికంగా అత్యంత అనుకూలమైనది కావడంతో డీఆర్డీవో దీనిని ఎంపిక చేసింది. ఒడిశాలోని బాలాసోర్ తర్వాత, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక పరీక్షల కోసం ఈ కేంద్రం కీలకం కానుంది.ఈ ప్రాజెక్టు అమరావతికి కేవలం వ్యూహాత్మక ప్రాధాన్యతనే కాదు, గణనీయమైన అభివృద్ధిని కూడా తీసుకురానుంది.
కేంద్రం
ప్రాజెక్టుతో పాటు గుల్లలమోద పరిసర ప్రాంతాల్లో రహదారులు, విద్యుత్తు, నీటి వసతి వంటి మౌలిక సదుపాయాలు భారీగా అభివృద్ధి చెందుతాయి. ఇది అమరావతికి అనుబంధంగా అభివృద్ధి చెందే ప్రాంతాలకు ఊతమిస్తుంది.ఈ కేంద్రం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రక్షణ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.సుమారు 300 మంది శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బంది ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడం, రాబోయే ఐదేళ్లలో డీఆర్డీవో రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు చేయనుండటంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమవుతుంది. దీని ప్రభావం సమీపంలోని రాజధాని ప్రాంతంపైనా సానుకూలంగా ఉంటుంది.

ఏరోస్పేస్
దేశ రక్షణలో అత్యంత కీలకమైన ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా రాజధాని అమరావతికి సమీప ప్రాంతం వేదిక కావడం రాష్ట్ర ప్రతిష్ఠను పెంచనుంది. భవిష్యత్తులో మరిన్ని రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమలు రాష్ట్రానికి, ప్రత్యేకించి అమరావతి ప్రాంతానికి తరలివచ్చేందుకు ఇది దోహదపడుతుంది. మొత్తంగా, గుల్లలమోద క్షిపణి పరీక్ష కేంద్రం, అమరావతి అభివృద్ధి ప్రస్థానంలో ఒక మైలురాయిగా, దాని కీర్తి కిరీటంలో మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: Supreme court: దగ్గుబాటి సురేశ్ కు సుప్రీం కోర్టులో లభించని ఊరట